ఆంధ్రా సర్కార్ ఎగ్గొట్టింది, సిగ్గులేకుండా: మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: విభజన చట్టం ప్రకారం రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా ఆంధ్రా సర్కార్ ఎగ్గొట్టిందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంగళవారం నాడు నిప్పులు చెరిగారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ కొనుగోళ్లపై ఎలాంటి చర్చకైనా తాము సిద్దమని ప్రకటించారు.
ప్రతిపక్షాలు అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు. కృష్ణపట్నం నుంచి న్యాయంగా రావాల్సిన వాటా ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. సిగ్గులేకుండా ఓపెన్ టెండర్లలో పాల్గొన్నారని దుయ్యబట్టారు.
పారదర్శకంగా ఓపెన్ టెండర్లలో 2 వేల మెగావాట్ల విద్యుత్ పారదర్శకంగా కొనుగోలు చేశామన్నారు. 53.89 శాతం విద్యుత్ను ఆంధ్రా సర్కార్ ఎగ్గొట్టిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఇవాళ తెలంగాణలో విద్యుత్ కష్టాలు తీరాయన్నారు.
తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు రావని, గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని పని చేశారన్నారు. ప్రయివేటు సంస్థలు తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామని ముందుకు వస్తే అడ్డుకున్నారు. తెరాస ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారన్నారు.
తెలంగాణ అవసరాలు తెలంగాణకు ఉన్నాయని వాటి దృష్ట్యా తాము ప్రణాళికలు వేసుకున్నామన్నారు. ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేయడం వల్లే తెలంగాణలో విద్యుత్ కష్టాలు తొలగిపోయాయని పేర్కొన్నారు. ఎవరి మెప్పు కోసమో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.