హరీష్కు పోటీ దేశంలోనే లేరు!: ఆకాశానికెత్తిన జగదీశ్వర్, తెలంగాణలో సెలవు
మెదక్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పైన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సోమవారం నాడు ప్రశంసలు కురిపించారు. ఆయన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... హరీష్ రావును సిద్దిపేటకు పంపించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. నిరంతరం ప్రజా సమస్యల పైన స్పందిస్తూ గత సీమాంధ్రుల పాలనలో కూడా అదరగొట్టి సిద్దిపేట ప్రాంతానికి నిధులు తీసుకు వచ్చారన్నారు.
దేశ చరిత్రలోనే హరీష్ రావుతో పోటీ పడే వారు లేకపోవచ్చునని చెప్పారు. ఆయన శక్తికి మించి శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. అందుకు సిద్దిపేట అభివృద్ధి నిదర్శనమని చెప్పారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో సంతాపంగా మంగళవారం నాడు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు.
అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కలాం మృతికి కేంద్రం ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.