కాంట్రాక్టుల కోసం కేసీఆర్ చుట్టూ 300 సార్లు తిరిగిన దొంగ.. కోమటిరెడ్డి?
ప్రజలను మోసంచేస్తూ కోమటిరెడ్డి సోదరులు ఆడుతున్న నాటకానికి తెరదించాలని, వారి ఆటలు సాగవని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడులో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వస్తానని ఆఫర్ అడిగిన దొంగ కోమటిరెడ్డిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని విమర్శించారు. ఇదే విషయమై ఆయన ముఖ్యమత్రి కేసీఆర్ చుట్టూ 300 సార్లు తిరిగారని, నడిబజారులో అమ్ముడుపోయినట్లు సాక్ష్యాలున్నాయన్నారు. రూ.21వేల కోట్ల కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి అమ్ముడుపోయారనే విషయం ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసిందన్నారు.
ఇలాంటి మోసాలకు పాల్పడేవారు బుకాయించడం దేనికని మంత్రి ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ రూపాయికి, కాంట్రాక్టులకు అమ్ముడుపోలేదని, 5 దశాబ్దాలుగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా మిషన్ భగీరథ జలాలతో విముక్తి లభించిందని చెప్పారు.
Recommended Video
ఎనిమిది సంవత్సరాల పాలనలో ఏ అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళుతున్నారని కోమటిరెడ్డిని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. నిత్యావసరాలు, గ్యాస్ దరలు పెరిగాయని, అటువంటి పార్టీలోకి ఎందుకు వెళుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నిక దొంగలు, ద్రోహులు, పైరవీకారులకు ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతోందని అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే ప్రజాదీవెన సభాస్థలిని తుంగుతర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు.