'ఉనికి కోసమే విమర్శలు, నేను నిప్పులాంటి వాణ్ణి'
హైదరాబాద్: రాజకీయ ఉనికి కోసమే తనపై విమర్శలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేను నిప్పులాంటి వాణ్ని. నాతో పెట్టుకుంటే భంగపడక తప్పదు. రాత్రింబవళ్లు అహర్నిశలు కృషి చేసి తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు రచించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు.
కేజీ టు పీజీ విద్యా విధానాన్ని దేశంలోనే అత్యంత ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడ కరెంట్ ఉన్నా కొనుగోలు చేసి రైతులకు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామి ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు తెరవెనుక ఇంకా తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని అన్నారు. చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసి చుట్టూ కంచె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుమన్నారు.
విద్యుత్ శాఖలో అవినీతిని తగ్గించేందుకు పారదర్శక విధానాన్ని తీసుకొస్తామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే తమ ముఖ్య ఉద్దేశమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.