మెగా ప్రాజెక్టు నిర్వాకం: కన్నేపల్లి లిఫ్టులో గంటసేపు ఇరుక్కుపోయిన మంత్రి
Recommended Video
కన్నేపల్లి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు శుక్రవారం జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్. ఇక ఈ ప్రాజెక్టు గురించి అంతర్జాతీయ మీడియా కొనియాడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మించింది. అహో అనిపించేలా ప్రాజెక్టును కంప్లీట్ చేసిన ఈ సంస్థ కొన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైంది. తెలంగాణకే తలమానికంగా నిలిచిన ప్రాజెక్టులో లిఫ్టులోపం స్పష్టంగా కనిపించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సమీపంలోని కన్నెపల్లి పంప్హౌజ్ వద్ద లిఫ్ట్లో తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇరుక్కుపోయారు. లిఫ్ట్ మొరాయించడంతో ఏమిచేయాలో అర్థంకాలేదు. దాదాపు గంటసేపు మంత్రి లిఫ్టులోనే చిక్కుకుపోయారు. అధికారులు లిఫ్టును తెరిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులానే మారాయి. ఇక చేసేదేమీలేక లిఫ్టు అద్దాలను పగలగొట్టి మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మంత్రి జగదీశ్వర్ రెడ్డి లిఫ్టులో ఇరుక్కుపోవడంతో చాలామంది ఆందోళన చెందారు. సాధారణంగా లిఫ్టు ఇరక్కపోతే బయటకు వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. అసలు కొత్తగా నిర్మించిన లిఫ్టు మొరాయించడమేంటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలాంటి భారీ ప్రాజెక్టు పూర్తి చేసిన మెగా ఇంజినీర్స్ సంస్థ చిన్న చిన్న వాటిని విస్మరించడంపై పలువురు విమర్శించారు. అసలు లిఫ్టు ఎలా మొరాయించిందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తానికి మంత్రి క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.