మంత్రి తలసాని బంధువులు దాడి చేశారు: ఫిర్యాదు, కేసు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కజిన్, అనుచరులు తన పైన దాడి చేశారని జిహెచ్ఎంసి ఉద్యోగి ఒకరు ఆరోపించారు. గురువారం రాత్రి తన పైన బోయిగూడలోని తన ఇంటి వద్ద దాడికి పాల్పడ్డరాని ఆరోపించారు.
బాధితుడి పేరు సాయి కుమార్. సాయి కుమార్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. టి శ్రీను యాదవ్, మరో పదిమంది వచ్చి సాయిని బయటకు లాక్కెళ్లారని, అతనిని దారుణంగా కొట్టారని ఆరోపించారు. సాయి కుమార్ చెల్లెలు అడ్డుకోబోయిందని, ఆమెకు గాయాలయ్యాయని చెప్పారు.
దాడి చేసిన వారు ఇంట్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారని ఆరోపించారు. సాయిని ముషీరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. అతను శుక్రవారం ఉదయం వరకు వెంటిలేటర్ పైన ఉన్నారని చెప్పారు. కాగా, ఇందుకు సంబంధించి శ్రీను, మరో ఆరుగురి పైన కేసు నమోదయింది.
శ్రీనుతో పాటు సిద్దు, సాకేత్, సుమన్, విక్రమ్, సంతోష్, మనోజ్ల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదయింది. దీనిపై మంత్రి తలసాని మాట్లాడుతూ... చట్టం ముందు ఎవరైనా సమానమేనని చెప్పారు. ఇలాంటి దాడి ఘటనలను ఎవరూ ప్రోత్సహించరని చెప్పారు. పోలీసులు విచారిస్తారని, తాను జోక్యం చేసుకోనని చెప్పారు. కాగా సాయి కుమార్ జిహెచ్ఎంసి హెల్త్ డిపార్టుమెంట్, అంబర్ పేట సర్కిల్లో పని చేస్తున్నారు.