జగన్కు జవాబు చెప్పే సత్తా బాబుకు లేదు: కెటిఆర్, రేవంత్కు నిలదీత
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పే సత్తా చంద్రబాబుకు లేదని, అందుకే సెక్షన్ 8ను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు.
ఏపీలో సమస్యల విషయంలో అక్కడి ప్రజలను కూడా దృష్టి మరల్చే ఉద్దేశ్యంలో భాగంగానే సెక్షన్ 8 అంటూ చెబుతున్నారని విమర్శించారు. సెక్షన్ 8 అమలు చేయాలని తీర్మానం చేయడాన్ని కెటిఆర్ ఖండించారు. ఏపీ శాసన సభ గురువారం ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. ఈ తీర్మానంలో హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయలని కూడా ఉంది.
కెటిఆర్ ఇంకా మాట్లాడుతూ... అసెంబ్లీ స్థానాల పెంపు పైన కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడామని చెప్పారు. అసెంబ్లీ స్థానాల పెంపుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మిషన్ భగీర్థకు కేంద్రం సాయాన్ని కోరామన్నారు.
తెలంగాణది అప్రజాస్వామికం: గంటా
ఏపీ ఉన్నత విద్యా మండలి ఆస్తుల విషయంలో తెలంగాణ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా అన్నారు. ఏ రాష్ట్రానికైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ఉన్నత విద్యామండలి విభజనపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.
ఎల్ రమణ, రేవంత్ రెడ్డికి నేతల నిలదీత
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అంశంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు.. రేవంత్ రెడ్డి ఎల్ రమణలను నిలదీశారు.
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మెయిన్ రోడ్డు పైన బైక్ ర్యాలీలు చేస్తే ఎలా గెలుస్తామని వారిని నిలదీశారు. నాయకులు ప్రచారం కోసం డివిజన్ల వరకు రాలేదని మండిపడ్డారు. పలువురు నాయకులతో పాటు కార్యకర్తలు నిరసన తెలిపారు.
నాయకులు, కార్యకర్తలతో సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టిక్కెట్లు ఇప్పించి గెలిపించే ప్రయత్నం చేశామన్నారు. కొందరు టిడిపి నుంచి గెలిచి స్వార్థ రాజకీయాలతో పార్టీలు మారారని మండిపడ్డారు. తెలంగాణలో టిడిపిని లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. కార్యకర్తల నిలదీతపై మాట్లాడుతూ... ఇలాంటి ఆలోచన, ఆవేశం సహజమేనని చెప్పారు.