కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత.!అర్హులైన దివ్యాంగులకు మంత్రి కేటీఆర్ ఉపకరణాల పంపిణీ.!
హైదరాబాద్ : మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధ అర్థం చేసుకుని వారి కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని దివ్యాంగులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాట సీఎం చంద్రశేఖర్ రావు తమకు ఎప్పుడూ చెప్తుంటారని గుర్తు చేసారు. పేదరికంలో ఉండే పేదలు కానీ, ఇతర శారీరకమైన ఇబ్బందులు ఉండే దివ్యాంగులకు బాసటగా, ఆసరాగా నిలబడాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కేటీఆర్ ఉద్ఘాటించారు.
ఎదుటి వారి కష్టాల్లో తోడున్నప్పుడే సార్థకత.. మంత్రి కేటీఆర్ ఉద్ఘాటన..
అంతే కాకుండా అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు మంత్రి కేటీఆర్. వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు వికలాంగులశాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.. మంత్రి కేటీఆర్..
ఏ రాష్ర్టంలో చేయని విధంగా 24 కోట్ల 38 లక్షల రూపాయలతో 16,600 మంది దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణీ చేయడం సంతోషాన్నిస్తుందన్నారు. నాలుగైదు నెలల కిందట దివ్యాంగుల సమస్యల పట్ల సమావేశం నిర్వహించి కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని చాలెంజ్ చేయడం జరిగింది. అందులోని ఆవిష్కరణలను కొన్నింటిని ఇవాళ దివ్యాంగులకు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లను అందజేస్తున్నామని చెప్పారు. నైపుణ్యా శిక్షణా కేంద్రాలను దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు.
దివ్యాంగులకు సముచిత స్దానం కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే.. పేర్కొన్న మంత్రి కేటీార్..
గతంలో దివ్యాంగులకు పెన్షన్ల కింద 500 రూపాయలు ఇస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం 3016 రూపాయలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో కూడా 5 శాతం ఇండ్లను దివ్యాంగులకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నిబంధన అన్ని జిల్లాల్లో అమలయ్యే విధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లను దివ్యాంగుల కోసం అమలు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద దివ్యాంగుల వివాహాలకు 1,25,145 రూపాయల చొప్పున చెల్లిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లలో 5శాతం దివ్యాంగులకు.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన కేటీఆర్..
దివ్యాంగుల సమస్యలను సీఎం చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దివ్యాంగులకు పంపిణీ చేసిన పరికరాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. త్రిచక్ర (రిట్రోపిట్డెడ్) మోటార్ బైక్లు 900, బ్యాటరీ వీల్చైర్స్ 650, ల్యాప్టాప్లు 300, 4జీ స్మార్ట్ఫోన్లు 400, డైసీ ప్లేయర్స్ 120, త్రిచక్ర వాహనాలు 1,500, వీల్ చైర్స్ 2,000, చంక కర్రలు 3,000, వినికిడి యంత్రాలు 1,460, అంధుల చేతికర్రలు 2,065, ఎంపీ-3 ప్లేయర్స్ 800, బ్రెయిలీ బుక్స్ 478, ఇన్నొవేటివ్ స్మార్ట్ కేన్స్ 165, ఇన్నొవేటివ్ వీల్స్చైర్స్ ఫర్ క్రికెటర్స్ 13, ఇన్నొవేటివ్ క్రచెర్స్ 155, ఆర్టిఫిషియల్ లింబ్స్ 334, క్యాలీపెర్స్ 260, బ్యాటరీ ట్రై సైకిళ్లు 2,000ను అందజేసారు మంత్రి కేటీఆర్.