మంత్రి కేటీఆర్ రక్తదానం.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై కార్యకర్తలకు కీలక సూచనలు
ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి 20వ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో తలసేమియా వ్యాధి గ్రస్తులు, ఇత అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్టు తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా స్థానిక ఆసుపత్రుల్లో రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
20 సంవత్సరాల పార్టీ ప్రస్థానం ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు అని చెప్పవచ్చన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా ఇంట్లోనే జరుపుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
60 లక్షల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ అజేయ శక్తిగా నిలిచిందని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో సీఎం కేసీఆర్ మార్గదర్శనం చూశాక.. మరో 15 ఏళ్ల పాటు ఆయన నాయకత్వమే కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో ప్రతీ ఒక్కరూ కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొందన్నారు. తెలుగు ప్రజలకు కేసీఆర్ మీద ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని, టీఆర్ఎస్ ఈ స్థితిలో ఉండటానికి కేసీఆర్ నాయకత్వమే కారణమని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ను ద్వేషించినవారు సైతం ఇప్పుడు ఆయన్ను అభిమానిస్తున్నారని అన్నారు. ఈ కష్టకాలంలో మీ చుట్టుపక్కల అవసరం ఉన్నవారిని ఆదుకోవాలని,ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో సోమవారం ఉదయం 9.30గంటలకు టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించనున్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా పార్టీ పతాకావిష్కరణ చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వయంగా రక్తదానం చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS.#20YearsOfTRS #TRSFormationDay pic.twitter.com/4GSivZ3Vmp
— TRS Party (@trspartyonline) April 26, 2020