ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివి.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా-కేటీఆర్ చొరవతో గౌరవప్రదమైన జాబ్
ఉన్నత చదువు చదివి... చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క... తప్పనిసరి పరిస్థితుల్లో స్వీపర్గా పనిచేస్తున్న ఓ మహిళకు మంత్రి కేటీఆర్ చేయూతనిచ్చారు.జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఆమెకు గౌరవప్రదమైన ఉద్యోగం ఇప్పించారు.మంత్రి చేయూతకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
రజనీ అనే మహిళ గత ఆర్నెళ్లుగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్నారు. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడం... భర్త అనారోగ్యంతో కుటుంబ పోషణ భారం ఆమెపై పడింది. భర్త,అత్త,ఇద్దరు పిల్లలను పోషించేందుకు జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరాల్సి వచ్చింది. రూ.10వేల వేతనంతోనే ఆమె కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
ఇటీవల ఓ దినపత్రికలో వచ్చిన కథనంతో ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. వెంటనే రజనీని ప్రగతి భవన్కు పిలిపించారు. సోమవారం(సెప్టెంబర్ 20) ఐఏఎస్, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి ఆమె కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా రజనీ నేపథ్యం,పరిస్థితి గురించి మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి... రజనీ విద్యార్హతకు తగిన పోస్టులు ఏమైనా ఖాళీ ఉన్నాయా అని వాకబు చేశారు. జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ పోస్టు ఇప్పించారు. దానికి సంబంధించిన ఆఫర్ లెటర్ను కూడా అక్కడే అందజేశారు.
మంత్రి కేటీఆర్ ఇచ్చిన చేయూతకు రజనీ భావోద్వేగానికి గురయ్యారు. రజనీని ఓదార్చిన కేటీఆర్ ఆమెకు మంచి భవిష్యత్తు ఉంందని చెప్పారు. చదువు ఎప్పుడూ తలవంచుకునేలా చేయదని ధైర్యం చెప్పారు.ఇదే విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన కేటీఆర్.. రజనీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రజనీ కుటుంబ నేపథ్యం :
రజనీ స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల.నిరుపేద కుటుంబం కావడంతో చదువుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు.ఇంటర్లో 87శాతం మార్కులు సాధించారు.మెడిసిన్లో సీటు రాకపోవడంతో బీఎస్సీ,ఆ తర్వాత ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివారు.2013లో హైదరాబాద్ సెంట్రలో యూనివర్సిటీలో పీహెచ్డీకి అర్హత సాధించారు.కానీ ఇంతలోనే తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో పీహెచ్డీలో చేరలేదు. భర్త వృత్తిరీత్యా పెళ్లి తర్వాత హైదరాబాద్లో ఉంటున్నారు. న్యాయవాది అయిన ఆమె భర్త పెళ్లయిన కొన్నేళ్లకు గుండెపోటు బారినపడ్డారు. మూడుసార్లు స్టెంట్ వేశారు.దీంతో ఆయన తన వృత్తిని కొనసాగించలేని పరిస్థితిలో ఇంటి వద్దే చిన్న దుకాణం నడుపుతున్నారు. ఇద్దరు పిల్లలు,అత్త,అందరి పోషణ భారమవడంతో.. రజనీ తప్పనిసరి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ పారిశుద్ద్య కార్మికురాలిగా చేరారు.అంతకుముందు,వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పటికీ కరోనా,లాక్డౌన్ కారణాలతో ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇదే క్రమంలో ఆమె ధీన స్థితిపై ప్రముఖ పత్రికలో కథనం ప్రచురితమైంది.అది కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆమెకు గౌరవప్రదమైన జాబ్ ఇప్పించారు.