హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య హైస్పీడ్ రైలు ...అభివృద్ధే లక్ష్యం : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజయవాడ హైదరాబాద్ హై స్పీడ్ ట్రైన్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైలు అవసరం ఉందని ఆయన అన్నారు.విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రమని, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం అని పేర్కొన్న కేటీఆర్ ఈ నగరాల మధ్య రైలు వస్తే జాతీయ రహదారి వెంట బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బి లింగయ్య యాదవ్ అభ్యర్థనపై స్పందించిన మంత్రి
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ . నైపుణ్య అభివృద్ధి కేంద్రానికి పునాదిరాయి వేశారు. ఒక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, నైపుణ్య అభివృద్ధి కేంద్రం సిద్ధమైన తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తుందని అన్నారు. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బి లింగయ్య యాదవ్ అభ్యర్థన మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు విషయాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకు వెళ్తానని కెటిఆర్ తెలిపారు.
ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు .. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు .తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్న మంత్రి కేటీఆర్ సంక్షోభ పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రజల అవసరాలను తీరుస్తూ, అన్ని పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే వారి తాట తియ్యండి
కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్న సమయంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే దిశగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షోభ సమయంలోనూ రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.అంతే కాదు ప్రభుత్వ భూముల కాపాడటంలో అధికారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎవరైనా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే వారి తాట తియ్యాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్.
రాజకీయాలకు అతీతంగా పని ... ఉత్తమ్ కు శుభాకాంక్షలు
సూర్యాపేటలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పిసిసి చీఫ్ గా ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు రెవెన్యూ డివిజన్లు ఉండగా వాటిని 73 కి పెంచామని పేర్కొన్నారు. తండాలు గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చామని పది జిల్లాలతో కూడిన తెలంగాణను 33 జిల్లాలకు పెంచామని కేటీఆర్ గుర్తు చేశారు. అధికారులు రాజకీయాలకతీతంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని కేటీఆర్ వారికి సూచించారు.