ఇదెక్కడి న్యాయం.. బడ్జెట్లో తెలంగాణను విస్మరించడంపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి
కేంద్ర బడ్జెట్-2020పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్-2020 తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. ఓవైపు ఆర్థిక సర్వే తెలంగాణను ప్రగతి కాముక రాష్ట్రంగా పేర్కొంటే... బడ్జెట్లో మాత్రం కేంద్ర పన్నుల వాటాలో కోత విధించారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత విధించడం ద్వారా రాష్ట్ర సంక్షేమ అభివృద్దిపై అది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేటీఆర్ వరుస ట్వీట్లతో కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఆర్థిక నిర్వహణలో కేంద్రం పేలవం..
కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 18.9% మేర తగ్గిందని.. దేశ ఆర్థిక వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వం ఎంత పేలవంగా నిర్వహిస్తోందో ఈ విషయం రుజువు చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రణాళికను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు.
ఆ పథకాలకు కేటాయింపులేవి..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ వంటి పథకాలకు రూ.24వేల కోట్ల ఆర్థిక సహాయం చేయాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించిందని.. కానీ తాజా బడ్జెట్లో కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కేటీఆర్ విమర్శించారు. సాగునీటి,సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం కావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు అందించిందని.. కానీ కేంద్ర ప్రభుత్వం, దీనికి విరుద్ధంగా, వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి వివిధ రంగాలకు భారీగా బడ్జెట్ కోతలను విధించిందని కేటీఆర్ అన్నారు.
జాతీయ హోదాను పట్టించుకోలేదు..
2019-20 కేంద్ర బడ్జెట్లో తెలంగాణలో పట్టణాభివృద్ది కోసం రూ.1037కోట్లు కేటాయించారని,కానీ ఈసారి దాన్ని మరింత తగ్గించి కేవలం రూ.889కోట్లు మాత్రమే కేటాయించారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని పట్టణాలు,నగరాలను అభివృద్ది చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది గండికొట్టిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ హామీల్లో ఏ ఒక్కదాన్ని కేంద్రం పట్టించుకోలేదన్నారు. అలాగే కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదన్నారు.
ఇండస్ట్రియల్ కారిడార్ల విజ్ఞప్తినీ పట్టించుకోలేదు..
ఇక హైదరాబాద్-బెంగళూరు,హైదరాబాద్-నాగ్పూర్,హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం చేసిన విజ్ఞప్తులను కూడా కేంద్రం పట్టించుకోలేదన్నారు. అంతకుముందు ప్రగతిభవన్లో పలువురు సీనియర్ అధికారులతో బడ్జెట్పై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు అన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉందన్నారు.
గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించిందన్నారు. కానీ తాజా బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు కోత పెట్టడం సరికాదన్నారు. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత కారణంగా తారుమారయ్యే అవకాశం ఉందన్నారు.