ఇప్పుడు చర్చ అనవసరం: కవిత 'అన్నయ్యే వారసుడు'పై కెటిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నిలిపేందుకు శ్రమించిన తన సోదరుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పార్టీ నాయకత్వానికి వారసుడు అవుతాడని ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ స్పందించారు. రాజకీయ వారసత్వంపై చర్చ అనవసరమని అబిప్రాయపడ్డారు.
గ్రేటర్ ఎన్నికల్లో కెటిఆర్ బాగా శ్రమించారని, ఆయననే కెసిఆర్ వారసుడని శనివారం నాడు నర్మగర్భంగా చెప్పారు. మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో తనను తాను నిరూపించుకున్నారన్నారు. రాత్రీ పగలూ శ్రమించారని కితాబిచ్చారు.
టిఆర్ఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారితో మమేకమై విజయానికి బాటలు వేశారని, ముఖ్యమంత్రి కెసిఆర్ స్ఫూర్తితో పార్టీ యంత్రాంగాన్ని సమర్థంగా ముందుకు నడిపించారని, ఇంత బాగా పనిచేసిన కేటీఆర్ పార్టీ నాయకత్వానికి వారసుడవుతాడని నేను భావిస్తున్నానన్నారు.
అయినా సమర్థుడు.. మా అందరికీ దైవ సమానమైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తున్న సమయంలో నాయకత్వంపై ఈ చర్చే అవసరం లేదన్నది తమ అభిప్రాయమని ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. వారసత్వం విషయమై కెటిఆర్ ఆ తర్వాత స్పందించారు.
నేను గతంలో, ఇప్పుడూ మంత్రిగానే ఉన్నానని, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని, కేసీఆర్ రాజకీయ వారసత్వంపై ఇప్పుడు చర్చ అనవసరమని, ఆయనకు ఇప్పుడు 62 ఏళ్లు అని, రాజకీయాల్లో ఇది పెద్ద వయస్సేమీ కాదని, మరో 20 ఏళ్లపాటు ఆయనే బాధ్యతలు నిర్వహిస్తారన్న నమ్మకం తనలో, ప్రజల్లోనూ ఉందన్నారు. అందువల్ల ఈ విషయంపై చర్చ అనవసరమన్నారు.