ఆవేశంలోనే తగులబెట్టారు, అప్పటి దాకా తెలియదు: నేరెళ్ల ఘటనపై తగ్గిన కేటీఆర్
నేరెళ్ల ఘటనపై మంత్రి కెటి రామారావు తగ్గారు. ప్రతిపక్షాలు, బాధితుల ప్రభావం కావొచ్చు. ఆయన బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై మంత్రి కెటి రామారావు తగ్గారు. ప్రతిపక్షాలు, బాధితుల ప్రభావం కావొచ్చు. ఆయన బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆవేశంలోనే తగులబెట్టారు, నాకు తెలియదు
అక్కడ ఇసుక లారీల ప్రమాదం నిజమేనని కేటీఆర్ అంగీకరించారు. అలాగే, బాధితులు ఆవేశంలో లారీలు తగలుబెట్టారని చెప్పారు. బాధితులను పోలీసులు అరెస్టు చేయడం, కస్టడీకి తీసుకోవడం తనకు తెలియదన్నారు. రిమాండ్ రిజక్ట్ అయ్యాక సమస్య బయటపడిందన్నారు.
పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎందుకు
బాధితులను చూస్తేనే పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము ఉద్యమం నుంచి వచ్చామని, కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని, ప్రజల్లో ఉండాలని కోరుకుంటామని చెప్పారు. నేరెళ్ల ఘటనలో పోలీసుల అత్యుత్సాహం ఉందన్నారు.
ఎప్పటికీ సిరిసిల్ల నుంచే పోటీ
తాను ఎప్పటికీ సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని కెటిఆర్ స్పష్టం చేశారు. బాధితులు పోలీసులపై ఫిర్యాదు చేశారని, తమ ప్రమేయం లేదన్నారు. నేరెళ్లకు రోజుకో ప్రతిపక్షం వెళ్తోందని, అందుకే ఆలస్యంగా వెళ్లానని కేటీఆర్ చెప్పారు. డిఐజి నివేదిక రాగానే కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. ఇసుక లారీలు ఎవరి పేరున ఉన్నాయి, కాంట్రాక్టులు ఎవరి పేరున ఉన్నాయో వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ కేసును దళితలపై దాడిగా చూడవద్దన్నారు.
హిమాన్షు మోటార్స్పై
తన హిమాన్షు కంపెనీ 2009 నుంచి నష్టాల్లో ఉందని కెటిఆర్ చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక కంపెనీ కార్యకలాపాలు నిర్వహించడం లేదని చెప్పారు. వాహనాలు టయోటా కంపెనీకే కాంట్రాక్టు ఇచ్చామన్నారు. హిమాన్షు కంపెనీ ప్రమేయం లేదన్నారు.
నేరెళ్ల ఘటనపై హైకోర్టు ఆదేశాలు
నేరెళ్ల ఘటనపై పౌర హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వేములవాడలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు ఎంజిఎం వైద్యుల బృందాన్ని పంపించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించి, రికార్డు చేయాలని చెప్పింది. అవసరమైతే వారిని నిమ్స్కు తరలించాలని, బుధవారం లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.