'హైదరాబాద్'పై కెటిఆర్ 100రోజుల ప్లాన్, పనిచేస్తే పొగడకున్నా సరే..
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్కు వంద రోజుల ప్రణాళికను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం నాడు ప్రకటించారు. జిహెచ్ఎంసి అభివృద్ధికి తాము ఈ ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని కెటిఆర్ ఈ సందర్భంగా చెప్పారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ పరిధిలో ఏకకాలంలో భవనాలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు.
వంద రోజుల్లో ఆన్లైన్ అనుమతుల ప్రక్రియకు శ్రీకారం చుడుతామని తెలిపారు. గతంలో భవనాలకు అనుమతుల కోసం ఏళ్ల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కేవలం నెల రోజుల్లో భవనాలకు అనుమతులపై వివరాలు వెల్లడిస్తామన్నారు
జిహెచ్ఎంసి పరిధిలో వార్డు కమిటీలు, ఏరియా కమిటీలు ప్రారంభించబోతున్నామన్నారు. నగరంలో రూ.200 కోట్లతో 569 బీటీ రోడ్లను నిర్మిస్తామన్నారు. రూ.30 కోట్లతో నగరంలో నాలాల క్రమబద్దీకరణ చేపడుతామన్నారు. రూ.కోటి వ్యయంతో 10 శ్మశాన వాటికలను నిర్మిస్తామన్నారు.
రూ.3 కోట్ల వ్యయంతో 50 బస్ బేలను నిర్మిస్తామని, రూ.26 కోట్లతో 40 మోడల్ మార్కెట్ల నిర్మాణం చేపడతామని, రూ.20 కోట్లతో లే అవుట్లకు ప్రహరీ గోడలు నిర్మించి పరిరక్షిస్తామన్నారు. నగరంలో చెత్త తరలింపునకు 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా సేవలందిస్తామన్నారు.
హైదరాబాదులో 20 కాలనీల్లో పార్కులను అభివృద్ధి చేస్తామని, మహిళా సంఘాలకు వంద రోజుల్లో రూ.100 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. ఈ-ఆఫీస్ ద్వారా ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. యూత్క్లబ్, అసోసియేషన్ల సహకారంతో జిమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
359 క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సలహాలు, ఫిర్యాదుల కోసం జిహెచ్ఎంసి పోర్టల్ రూపొందిస్తామన్నారు. సమస్యలపై ఫిర్యాదు కోసం హెచ్ఎండిఎ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. భారీ ఎత్తున ఇంకుడు గుంతలు నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని చెప్పారు.
పెండింగులోని వాటర్ కనెక్షన్లను మంజూరు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. మేం మంచి పని చేసినప్పుడు పొగడకపోయినా ఫరవాలేదని, కానీ మంచి సూచనలు ఉంటే మాత్రం జర్నలిస్టులు ఇవ్వాలని కెటిఆర్ సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని హితవు పలికారు. వంద రోజుల ప్రణాళిక నేపథ్యంలో జూన్ 2న మళ్లీ విలేకరుల ముందుకు వస్తానని చెప్పారు.