ఆకస్మిక తనిఖీలు,సమావేశాలు .. మునిసిపల్ సిబ్బంది,కాంట్రాక్టర్లను హడలెత్తిస్తున్న మంత్రి కేటీఆర్
తెలంగాణా మున్సిపల్ మంత్రి కేటీఆర్ మునిసిపల్ కార్యాలయాల పనితీరుపై దృష్టి సారించారు. అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు. ఒక పక్కన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మునిసిపాలిటీలను పరిశీలిస్తూనే అధికారులను, కాంట్రాక్టర్ లను పరుగులు పెట్టిస్తున్నారు . నిన్నటికి నిన్న దేవరకొండ మునిసిపాలిటీ పారిశుద్యంపై క్లాస్ పీకిన కేటీఆర్ పైన పటారం లోన లొటారం అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే . ఇక ఇదే సమయంలో జీహెచ్ఎంసీ పైన కూడా కేటీఆర్ దృష్టి పెట్టారు. నేడు జనగామ మునిసిపాలిటీ ఆకస్మిక తనిఖీ చేశారు.
పారిశుధ్యంపై సీరియస్ అయిన కేటీఆర్ .. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి వార్నింగ్
కాంట్రాక్టర్ల పనితీరుపై కేటీఆర్ ఆగ్రహం
తాజాగా జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ లకు మంత్రి కేటీఆర్ కీలకమైన, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతున్న తరుణంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు . జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాల విషయంలో పక్కాగా ఉండాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని కాంట్రాక్టర్ లను ఉద్దేశించి కేటీఆర్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమైన నేపధ్యంలో కాంట్రాక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు .
ఓ సారి చైనా వెళ్లి రండి అంటూ క్లాస్
చైనాలో కరోనా వైరస్ వ్యాపిస్తే అక్కడ 10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించారని చెప్పిన కేటీఆర్ ఇక్కడ మాత్రం ఒక చిన్న వంతెన లేదా రోడ్డు నిర్మించాలంటే ఏళ్లు పడుతోందని వ్యాఖ్యానించారు . గుంతల రహదారులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోవాలని , పాత పద్ధతులు మానుకోవాలని హితవు పలికారు. కావాలంటే ఓసారి చైనాకు వెళ్లి అక్కడి సాంకేతికతను పరిశీలించాలని సూచించారు.
మీ వల్ల కాకుంటే వదిలెయ్యండి .. కాంట్రాక్టర్లకు హెచ్చరిక
ఇక జీహెచ్ఎంసీ పనుల విషయంలో ప్రైవేటు సంస్థలకు నిర్మాణ కాంట్రాక్టులు ఇస్తే పరిస్థితి మెరుగవుతుందనుకుంటే ఇంత అధ్వానమా? అని ప్రశ్నించారు.మీ వల్ల అయితే చేయండి.. లేదంటే వదిలేయండి.. ఇక తెలంగాణలో ఎక్కడా పనులు చేయలేరు అంటూ కాంట్రాక్టర్లను హెచ్చరించారు.రహదారుల పరిస్థితి మెరుగుకు ఉద్దేశించిన సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం పైనా అసంతృప్తి వ్యక్తం చేశారు కేటీఆర్ .
జాప్యానికి కారణాలు చెప్పొద్దు .. సీరియస్ అయిన మంత్రి
ఇక ఇప్పటికీ ఒకటి, రెండు సంస్థలు పనులు ప్రారంభించకపోవడంపై ఫైర్ అయ్యారు. త్వరితగతిన పనులు చెయ్యాలని, క్వాలిటీ ఉన్న పనులే చెయ్యాలని ఆయన తెలిపారు. ఇక జాప్యం చేస్తూ అందుకు కారణాలను వెతుకుతున్నారని ఆగ్రహించిన కేటీ ఆర్ జాప్యాలకు గల కారణాలు తనకు చెప్పొద్దని పేర్కొన్నారు. తుది దశలో ఉన్న పనులు మే నాటికి, పురోగతిలో ఉన్నవి అక్టోబరుకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .
Recommended Video
మున్సిపాలిటీల ఆకస్మిక తనిఖీలు .. అధికారులు హడల్
ఇక మరోపక్క నేడు జనగామ మునిసిపాలిటీని ఆకస్మిక తనిఖీ చేశారు కేటీఆర్ . 13వ వార్డు ధర్మకంచ బస్తీలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరిన్ని స్వచ్ఛ వాహనాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక మున్సిపల్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీలు , అధికారులపై , కాంట్రాక్టర్లపై ఫైర్ అవుతున్న తీరుతో అటు అధికారులు, కాంట్రాక్టర్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.