కరోనాకు తొలి వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే - భారత్ బయోటెక్ క్యాంపస్లో కేటీఆర్ - కీలక వ్యాఖ్యలు..
అంతూపొంతూ లేకుండా సాగుతోన్న కరోనా విలయానికి అడ్డుకట్టవేసేలా.. తొలి కొవిడ్-19 వ్యాక్సిన్ హైదరాబాద్ లోనే తయారవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ, ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ తదితర కీలక సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు.
చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి - షాకింగ్ ఆరోపణలు - 48 గంటల డెడ్ లైన్ పై డెడ్లీ కామెంట్స్
క్యాంపస్లో కేటీఆర్ సందడి..
హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా నడుస్తోన్న భారత్ బయోటెక్ సంస్థ.. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ముందున్న సంగతి తెలిసిందే. జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ను కేటీఆర్ మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో పాలుపంచుకుంటోన్న అక్కడి ఉద్యోగులతో మంత్రి మాట్లాడారు. కీలక సమయంలో కేటీఆర్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అనంతరం ‘‘వ్యాక్సిన్ పై పోటీలో సైన్స్ - అత్యవసరం మధ్య పోటీ'' అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడుతూ.. కొవిడ్-19కు తొలి వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
టీకాల హబ్ హైదరాబాద్..
‘‘వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు పదేపదే చెబుతున్నాయి. ఇప్పటికే మన హైదరాబాద్ నుంచి.. ప్రపంచదేశాలకు కావాల్సిన వ్యాక్సిన్లలో మూడొంతుల ఉత్పత్తులు వెళుతున్నాయి. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. మీ అందరి నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమవుతోంది. కొవిడ్-19 వ్యాక్సిన్ కూడా ఇక్కడి నుంచి వస్తుందని వందశాతం నాకు నమ్మకముంది''అని మంత్రి కేటీఆర్ అన్నారు. కొవిడ్-19పై పోరులో భాగంగా ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు తయారు చేస్తోన్న భారత ప్రైవేటు రంగానిది కీలక పాత్ర అంటూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత సైంటిస్టు, ట్రంప్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంటోనీ ఫౌచీ ఇటీవల అభిప్రాయం వ్యక్తంచేసిన నేపథ్యంలో కేటీఆర్ తాజా కామెంట్లకు ప్రాధాన్యం ఏర్పడింది.
నిపుణులతో కేటీఆర్ సమాలోచనలు..
హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ లో నిర్వహించిన సదస్సులో కొవిడ్-19కు సంబంధించి పలువురు ప్రఖ్యాత నిపుణులతో మంత్రి కేటీఆర్ సమాలోచనలు చేశారు. సదస్సులో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరక్టర్ శక్తి నాగప్పన్, బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల, ఇండియన్ ఇమ్యూనలాజికల్ ఎండీ డాక్టర్ ఆనంద్ కుమార్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కరోనా రికవరీలో తెలంగాణ టాప్..
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1286 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69వేలకు, మృతుల సంఖ్య 563కు పెరిగింది. అయితే, రికవరీల విషయంలో జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉన్న తెలంగాణ టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. మొత్తం కేసుల్లో ఇప్పటికే సుమారు 50వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 1066 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18,708గా ఉంది.
Recommended Video
కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్పై WHO షాకింగ్ - 'మంత్రదండం' ఎన్నటికీ రాబోదంటూ..