'బిన్ లాడెన్' నిర్వాకంపై తెలంగాణ మంత్రి కెటిఆర్ లేఖ
హైదరాబాద్: సౌదీ అరేబియాలోని అతిపెద్ద నిర్మాణ సంస్థ బిన్ లాడెన్ గ్రూపులో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణకు చెందినవారు ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారని, వారందర్నీ ఆదుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను మంత్రి కేటీఆర్ కోరారు.
బిన్ లాడెన్ కంపెనీ పలువురు ఉద్యోగులను తొలగించింది. గత ఆరు నెలలుగా ఆ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తోంది. ఉద్యోగం నుంచి తొలగింపబడ్డ వారిలో తెలంగాణవారు ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా వేలాదిమందిని తీసేశారని తెలుస్తోంది.
ఉద్యోగాలు పోయిన వారిలో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. చాలామంది బిన్ లాడెన్ కంపెనీలో నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. వీరిలో కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. దీనిపై కేటీఆర్ స్పందించారు.
సౌదీలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు ఆందోళన చేయవద్దని కేటీఆర్ అన్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్వదేశానికి తిరిగి వచ్చే కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. విదేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లి ఇబ్బందుల్లో కూరుకుపోయిన కార్మికులకు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.