ఎస్సై రమేష్ మృతి వివాదం: నాకు సంబంధం లేదని మహేందర్ రెడ్డి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి శుక్రవారం చెప్పారు. ఎస్సై రమేష్ ఆత్మహత్య విషయం విలేకరులు ప్రశ్నించారు. దీంతో, మంత్రి స్పందించారు.
ఎస్సై వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఈ మేరకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికనే రుజువన్నారు. అక్కడ పోస్ట్ మార్టం వద్దంటే హైదరాబాద్కు ఎస్సై భౌతికకాయంను తీసుకొచ్చి ఉస్మానియాలో పోస్ట్ మార్టం జరిపించిన్నారు.
అసలు అక్కడ ఇసుక వ్యాపారమేలేదని అలాంటప్పుడు ఇసుక మాఫియా, పోలీసులు హత్య చేశారంటే ఎలా అని ప్రశ్నించారు. కావాలంటే మీడియా అంతా కలిసి వెళ్లి చూద్దామని, అక్కడ ఇసుక వ్యాపారం ఉందా లేదా తేలుతుందన్నారు.
రమేష్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు. ఒకవేళ ఇసుక మాఫియా ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు. ఎస్సై రమేష్ది హత్య అయితే, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చేయబోమని మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు.
రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో రంగారెడ్డి జిల్లాకు అతి తక్కువ కాలంలో నీళ్లు వస్తాయన్నారు. జనవరి, ఫిబ్రవరిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావొచ్చన్నారు.