మంత్రి మల్లారెడ్డి వర్సెస్ రాపోల్ రాములు, టికెట్ల కేటాయింపుపై ఆడియో రికార్డ్, వైరల్
మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపల్ టికెట్ల కేటాయింపు అధికార టీఆర్ఎస్ పార్టీలో అగ్గిరాజేసింది. మంత్రి మల్లారెడ్డి, బోడుప్పల్కి చెందిన నేత రాపోలు రాములు మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టికెట్ల కేటాయింపునకు సంబంధించి వారిద్దరు మాట్లాడిన ఆడియో ఒకటి వైరలవుతోంది. తనకు కూడా అడిగిన చోట టికెట్ ఇవ్వలేదని ఆ ఆడియోలో రాములు కామెంట్ చేశారు.
స్వేచ్చ లేదా..?
మంత్రి మల్లారెడ్డిపై రాపోలు రాములు ఫోన్ సంభాషణలో ఫైరయ్యారు. మంత్రి వద్ద మాట్లాడే స్వేచ్చ కూడా లేదని మండిపడ్డారు. ఉద్యమకారుడిని, సీనియర్ నేత అయిన తనకే గౌరవం లభించడం లేదన్నారు. తనతో వచ్చిన నేతలకు టికెట్లు ఎందుకివ్వలేదు అని అడిగారు. బొమ్మక్ శీనే గాక.. శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, రమేశ్తోపాటు తన సీటు సంగతేంటని అడిగారు. ఇది మంచి పద్ధతి కాదని తీరు మార్చుకోవాలని సూచించారు.
రాములుకు ఓకే.. రమేశ్ డౌట్..
రమేశ్ టికెట్పై ఇద్దరి మధ్య వాడీ వేడీగా డిస్కషన్ జరిగింది. రాములుకు అంటే టికెట్ ఇస్తానని.. రమేశ్కు ఇవ్వలేమని మంత్రి మల్లారెడ్డి ఫోన్ సంభాషణలో చెప్పారు. ఆ మాట ముందే చెబితే బాగుండేదని రాములు ప్రస్తావించారు. తన సంగతి ఏంటి అని రాములు అడిగారు. టికెట్ కేటాయించాం కదా అని అడిగితే.. తాను 10, లేదంటే 12వ వార్డు టికెట్ అడిగానని చెప్పారు. కానీ మరోచోటనే టికెట్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.
10,12వ వార్డు కష్టం..
10, 12వ వార్డు కష్టమని మంత్రి మల్లారెడ్డి అనడంతో.. తనకు టికెట్ ఇవ్వమని మిమ్మల్ని ఎవరు అడిగారని అనడంతో వాదనలు పీక్కి చేరాయి. అవసరమైతే తాను కేసీఆర్, లేదంటే కేటీఆర్ వద్దకెళ్లి టికెట్ తెచ్చుకుంటానని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో పళ్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి విషయం చెబుతానని రాములు బెదిరించారు. అంతేకాదు టికెట్ కోసం డబ్బులు అడిగావని.. దానికి సంబంధించి తన వద్ద ఆడియో, వీడియో కూడా ఉన్నాయని చెప్పారు.
జైలులో వేసినా..
టికెట్ల కేటాయింపు చేస్తున్న అరాచకాలపై పోరాడుతానని రాపోలు రాములు స్పష్టంచేశారు. తనపై పోలీసులు చర్యలు తీసుకున్నా.. జైలులో వేసిన భయపడబోనని చెప్పారు. ప్రాణం పోయినా.. టికెట్ల కేటాయింపుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాపోలు రాములు ఆడియో సంభాషణపై టీఆర్ఎస్ నేతలు ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ స్పందించారు. విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారు.