నారాయణ కొడుకు మృతి: అత్యంత సేఫ్టీ కలిగిన కారు ఎందుకు కాపాడలేదంటే?
ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్, ఆయన స్నేహితుడు రాజా రవివర్మ హైదరాబాదులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
హైదరాబాద్/అమరావతి: ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్, ఆయన స్నేహితుడు రాజా రవివర్మ హైదరాబాదులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ప్రయాణించిన కారు అంతర్జాతీయ, అత్యున్నత ప్రమాణాలతో తయారయింది. అయినప్పటికీ వారు మృతి చెందారు.
కొడుకు మృతదేహాన్ని చూసి నారాయణ కంటతడి
ఇందుకు కారణాలు ఉన్నాయి. ఆ కారు ఎంత ఉన్నత ప్రమాణాలతో తయారయినప్పటికీ.. స్పీడ్ లిమిట్ దాటితే మాత్రం ఆ భద్రతా ప్రమాణాలు అవి పని చేయవని అంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడే వ్యవస్థ ఉన్నప్పటికీ ఎందుకు పని చేయలేదనే చర్చ జరుగుతోంది.
బెంజ్లోని హైఎండ్ జీ సిరీస్ కారు
ప్రమాదం సమయంలో కారు స్పీడ్ను బట్టి ఆ భద్రతా ప్రమాణాలు పని చేస్తాయి. నిషిత్ ప్రయాణిస్తున్న కారు సాదాసీదా కారు కాదు. అంతర్జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా రక్షణ చర్యలు ఉండే బెంజ్ కారు. అందులోను బెంజ్ మోడల్లో హైఎండ్ అయిన జీ సిరీస్ కారు.
లోపం కారు స్పీడ్లోనే
కారు స్పెసిఫికేషన్స్కు తగ్గట్టు ఖరీదు కూడా చాలా ఎక్కువ. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ సెక్యూరిటీ ఫఈచర్స్తో అందులో ఉన్న వాళ్ల ప్రాణాలు పోకుండా కాపాడగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. లోపం మాత్రం కారు స్పీడ్లోనే ఉందని అంటున్నారు.
ఇదీ కారు
ప్రమాదం జరిగిన కారులో ఎలక్ట్రానిక్ గార్డ్స్తో కూడిన హైస్టాండర్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. కారు తయారీ కోసం ధృఢమైన ప్రత్యేకమైన స్టీల్ వినియోగిస్తారు. కారు డిజైన్లోనూ పూర్తిస్థాయి రక్షణ చర్యలను సరిచూస్తారు. అనుకోకుండా పేలుడు జరగకుండా, ఈ వాహనాలకు డిటోనేషన్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది. నాణ్యమైన ఎయిర్ బ్యాగ్స్ ఫెసిలిటీ ఉంది. ఈ కారులో ఉన్న ఇంజిన్ 5వేల 400 సీసీ ఇంజన్. 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్స్, 4 వీల్ డ్రైవ్ ఫీచర్లు ఈ మోడల్ కోసమే ప్రత్యేకంగా రూపొందించారు.
సడన్ బ్రేక్ వేసినా..
సడెన్ బ్రేక్ వేసినా అందులో ఉన్న వాళ్లకు ఏమీ కాకుండా అక్కడికక్కడే వాహనం ఆగే విధంగా యాంటీ బ్రేకింగ్ సిస్టంతో కూడిన బ్రేక్ ప్రొటెక్షన్ సదుపాయం ఉంది. నిర్ణీత స్పీడ్లో వెళ్తే ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా ఆటోమేటిక్గా స్పీడ్ కంట్రోల్ అవుతుందంటున్నారు. కానీ నిర్ణీత వేగం కన్నా కారు మరీ స్పీడ్గా వెళ్తుండటంతో ఆ సెన్సార్లు కూడా పని చేయవని చెబుతున్నారు.
గంటకు 80 కిలోమీటర్లు వెళ్తేనే..
ఇప్పుడు ప్రమాదానికి బెంజ్ కారులో కంపెనీ చెప్పిన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నా కంపెనీ నిర్ణయించిన వేగ నియంత్రణ పాటిస్తేనే ఆ ఫీచర్స్ పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ కారు గంటటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే పనిచేస్తాయని, వాహనం ధ్వంసమైనా అందులో ఉన్నవాళ్ల ప్రాణాలకు ప్రమాదం లేని రీతిలో ఈ ఫీచర్స్ రూపొందించారంటున్నారు. దీనినే ఇ-గార్డ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ స్పెషాలిటీ అని చెబుతారు. నిషిత్ కారు అతి వేగంతో ఉండటం వల్ల మృతి చెందారని చెబుతున్నారు.
భారత్ రోడ్లకు పనికి రావా?
సాధారణంగా ఈస్థాయిలో ప్రమాదం జరిగితే కారు పల్టీలు కొట్టి ఉండాల్సిందంటున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలున్న బెంజ్ కారు కావడంతో ప్రమాదం జరగ్గానే అక్కడే ఆగిపోయిందంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఇలాంటి హై బడ్జెట్ కార్లకు భారత్లోనూ గిరాకీ బాగా ఉంది. కానీ ఈ కార్లలో ఇచ్చే గరిష్ట వేగ పరిమితి భారత రోడ్లకు పనికి రాదంటున్నారు. దేశంలోని రోడ్ల నిర్మాణ ప్రమాణాల ప్రకారం 80 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించేందుకు అనువుగా ఉంటాయి. హైవేలైతే గరిష్టంగా 120 కిలోమీటర్లకు మించిన వేగం మన రోడ్లు పని చేయదంటున్నారు. విదేశీ బ్రాండ్ కార్లలో అదనంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నా వేగ పరిమితులు, నియంత్రణల్లో తేడా వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వాదనలు ఉన్నాయి.
యువత అత్యుత్సాహం
ఖరీదైన బైకులు, కార్లు గంటకు 200, 250, 295 కిమీ వేగంతో వెళ్లేలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. జాతీయ రహదారుల్లోనే గరిష్ఠవేగ పరిమితి 80 కిమీ. నగరాల్లో, అందులో ములుపులున్న ప్రాంతాల్లో మరింత తక్కువ వేగంతో వెళ్లాలి. ఇలాంటిచోట 200 కిమీ వేగ సామర్థ్యమున్న వాహనాలు యువతను అత్యుత్సాహానికి గురి చేస్తున్నాయి.