దానంతో గంటకుపైగా పద్మారావు మంతనాలు, వివేక్ కోసం రంగంలోకి హైకమాండ్
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ ఇంటికి టిఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి పద్మారావు మంగళవారం వెళ్లారు. దాదాపు ఇరువురు గంటకు పైగా చర్చలు జరిపారు. అయితే, వీరు దేని పైన చర్చ జరిపారో తెలియాల్సి ఉంది.
దానం కాంగ్రెస్ పార్టీని వీడుతారని, త్వరలో టిఆర్ఎస్లో చేరుతారనే వార్తలు గతంలో వచ్చాయి. అయితే, వాటిని ఆయన కొట్టిపారేశారు. దానం నాగేందర్ మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత టిఆర్ఎస్ నేత డి శ్రీనివాస్కు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో డిఎస్ చేరిన అనంతరం దానం కూడా కారు ఎక్కుతారని ప్రచారం జరిగింది.
వరంగల్ ఉప ఎన్నికల్లో గెలుస్తాం: ఉత్తమ్
వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలు అన్నారు. ఐదుగురు అభ్యర్థుల పేర్లతో హైకమాండ్ వద్దకు వెళ్తున్నట్లు చెప్పారు.
వివేక్ కోసం రంగంలోకి హైకమాండ్
పెద్దపల్లి మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత వివేక్ను వరంగల్ ఉప ఎన్నికల బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే అందుకు ఆయన ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ను ఒప్పించేందుకు నేరుగా హైకమాండ్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.
కేసులకు భయపడం: కిషన్ రెడ్డి
తాము కేసులకు భయపడేది లేదని, జైలుకు వెళ్లేందుకు సిద్ధమని బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం ఖమ్మం జిల్లాలో అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు.