తెలంగాణలో ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్ ఇదే..
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించారు. జులై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే జులై 1న పాలిసెట్,జులై 4న ఈసెట్,జులై 13న ఐసెట్,జులై 15న ఎడ్సెట్,జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్,జులై 10న లాసెట్,పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల రీషెడ్యూల్ను విడుదల చేశారు. కోవిడ్-19 నిబంధనలకు లోబడి, యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.
లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదా పడటంతో తాజాగా రీషెడ్యూల్ తేదీలను ప్రకటించారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా కరోనాను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని.. ఆ ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సబిత తెలిపారు. కాగా, పరీక్షల రీషెడ్యూల్పై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, వైస్ ఛైర్మన్స్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఫ్రొఫెసర్ వి.వెంకట రమణల శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.