పెద్ద ఇష్యూ కాదు! కృష్ణన్నతో మాట్లాడతా: భూ కబ్జా ఆరోపణలపై సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై ఆయనతోనే మాట్లాడతానని తెలిపారు. ఆయనను ఎవరో తప్పుదోవ పట్టించారని అన్నారు
కృష్ణన్నను మిస్గైడ్ చేశారు, పెద్ద ఇష్యూ కాదన్న సబితా ఇంద్రారెడ్డి
భూ కబ్జాలు జరిగివుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా చర్యలు తీసుకుంటారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదన్నారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణన్న( తీగల కృష్ణారెడ్డి)ను ఎవరో మిస్ గైడ్ చేసుంటారని, తాను ఈ విషయంపై ఆయనతోనే మాట్లాడతానని, అది పెద్ద ఇష్యూ ఏం కాదని సబితా ఇంద్రారెడ్డి మీడియాకు తెలిపారు.
సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు
మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మీర్పేట్ను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారన్నారు. మీర్పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని స్పష్టం చేశారు. సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆయన.. చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని ఆరోపించారు. తమ పార్టీ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచేయలేదని విమర్శించారు. మంత్రి సబిత వైఖరిపై సీఎంతో మాట్లాడతానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు.
మహేశ్వరంలో తీగల, సబిత వర్గాల మధ్య ఘర్షణ వాతావరణమే
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా.. సబిత విజయం సాధించారు. అనంతరం సబిత టీఆర్ఎస్ కండువా కప్పుకుని మంత్రి పదవి పొందారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తీగల, సబిత వర్గాల మధ్య ఘర్షణ వాతావరణమే ఉన్నట్లు తెలుస్తోంది. సబితారెడ్డి టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందటంతో తనకు ప్రాధాన్యం తగ్గిందని తీగల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తీగల విమర్శలు వీరి మధ్య విభేదాలను బహిర్గతం చేశాయి.