Medaram Jatara: గద్దెలపైకి సమ్మక్క.. మంత్రి సత్యవతి కాన్వాయ్పై రాళ్లదాడి
ప్రఖ్యాత మేడారం జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే అమ్మవారి రాక గురువారం ఘనంగా జరిగింది. కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో కోయపూజారులు చిలకలగుట్ట నుంచి గద్దెల వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్సీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి ఊరేగింపునకు స్వాగతం పలికారు. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య సమ్మక్కకు భక్తులు నీరాజనాలు పలికారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజన ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్యతోపాటు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేతలతోపాటు అధికారులూ ఆదివాసీ కళాకారులతో కలిసి చిందులేశారు. గద్దెల దగ్గర భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో కంట్రోల్ చేయడానికి పోలీసులు తంటాలుపడాల్సివచ్చింది.
ఇదిలాఉంటే, ఉత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న సమయంలో రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ పై దాడి జరగడం కలకలం రేపింది. మంత్రి కారుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమైపోగా, మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. భక్తుల రూపంలో వచ్చిన దుండుగులు దాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.