అక్కడ బద్ద శత్రువులు, ఇక్కడ మాత్రం స్నేహహస్తం, కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్
మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ ఏకమైన టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టలేకపోయామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో బద్ద శత్రువులైన ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో గెలిచాక ఇక్కడ కలిసి పనిచేయడం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నారు. కానీ టీఆర్ఎస్ చెప్పినట్టు వందకుపైగా మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేసిందని చెప్పారు.
అధికారం కోసం..
ఆమన్ గల్లు, మణికొండ, మక్తల్లో కాంగ్రెస్, బీజేపీ చేసిందేంటీ అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు అధికారం కోసం ఒక్కటి కావడం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు. ఆ రెండు పార్టీలు కలిసినా టీఆర్ఎస్ పార్టీని ఢీ కొనే పరిస్థితి లేదన్నారు. వారి నీచ రాజకీయాలను ప్రజలు గమనించారని చెప్పారు. ఎన్నికల ముందు కులాల పేరు చెప్పిన నేతలు ఎన్నికలు ముగిసిన తర్వాత మరచిపోయారని పేర్కొన్నారు. కులాల గురించి ఆ రెండు పార్టీలు ప్రస్తావించి.. మరింత దిగజార్చాయని పేర్కొన్నారు.
చేతులు కలిపి
జాతీయ స్థాయిలో బద్ద శత్రువులు కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో ఏకమయ్యాయని చెప్పారు. ఒక ప్రాంతీయ పార్టీనీ ఎదుర్కొనేందుకు చేతులు కలిపాయంటే తమ బలం ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. 70 ఏళ్లు పాలించిన ఆ రెండు పార్టీలు.. కులం పేరు చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే వారసుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పారు.
కారు జోరు..
ఇదిలా ఉంటే ఇవాళ మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. నేరేడుచర్లలో మాత్రం ఉత్కంఠగా రాజకీయాలు సాగాయి. ఎక్స్ అఫిషీయో సభ్యులతో టీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, టీఆర్ఎస్ నుంచి శేరి సుభాష్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఎన్నికల సంఘం ఇవ్వడంతో టీఆర్ఎస్ ఓట్లు 11క చేరాయి. ఏడుగురు కౌన్సిలర్లు, నలుగురు ఎక్స్ అపిషీయో ఓట్లతో మున్సిపాలిటీని చేజిక్కించుకుంది.