గ్రీన్ ఛాలెంజ్, ఆ బాధ్యత మనదే: ప్రభాస్-ఎన్టీఆర్లకు మంత్రి తలసాని సవాల్
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గత కొద్దికాలంగా తెలంగాణలో పలువురు ప్రముఖులు హరిత సవాల్ను చేపడుతోన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మంత్రి తలసానికి హరిత సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన మంత్రి శుక్రవారం ఉదయం తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, త్రివిక్రమ్శ్రీనివాస్, ఏపీ నేత, టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్లకు హరిత సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మానవుల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని కోరారు. హరితహారం పేరుతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటినట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ ఉండాలంటే మనమంతా మొక్కలు నాటాలని, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.
గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రముఖులు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటుతూ గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నారు. కొద్ది రోజుల క్రితం టీర్ఎస్ నిజామాబాద్ ఎంపీకల్వకుంట్ల కవిత మొక్కలు నాటి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, దర్శకులు రాజమొళి, క్రీడాకారిణి సైనా నెహ్వాల్లకు సవాల్ విసిరారు.
గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కవిత, కేటీఆర్, నాయిని నర్సింహా రెడ్డిలతో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులు సైనా నెహ్వాల్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, పుల్లెల గోపీచంద్, సచిన్ టెండుల్కర్, మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి తదితరులు మొక్కలు నాటారు.