25 ఏళ్లుగా బీజేపీకి దిక్కు లేదు.. కాలం చెల్లిన నేతలకు కండువా.. మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ను చెడుగుడు ఆడుకుంటున్న బీజేపీ నేతలను ఇరుకున పెట్టేలా గులాబీ నేతలకు అస్త్రం దొరికింది. ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులకు కమల తీర్థం పోయడంతో బీజేపీ నేతలపై మండిపడుతున్నారు. అటు కమలనాథులకు కూడా నోటి నిండా పని దొరికినట్లైంది. అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ ఓ రేంజ్లో ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నారు.
ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కిస్తుండటంపై ఇన్నాళ్లు టీఆర్ఎస్ నేతలపై గుర్రుమన్నారు బీజేపీ లీడర్లు. తీరా కమలనాథులు కూడా అదే పని రాజ్యాంగ విరుద్దంగా చేస్తున్నారంటూ ఫైరవుతున్నారు కారు గుర్తు నేతలు. అలా రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. తాజాగా మంత్రి తలసాని, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. హైదరాబాద్ బోనాలు ఎప్పుడంటే..!
ఫిరాయింపుల కోసం ఉపరాష్ట్రపతిని వాడుకున్నారు..!
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను తెగ వ్యతిరేకించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చివరకు చేసిందేంటని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సాక్షాత్తు వైస్ ప్రెసిడెంట్తోనే టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ బులెటిన్ విడుదల చేయించడం దేనికి సంకేతమన్నారు.
శనివారం నాడు టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో కలిసి టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తలసాని. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు. టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి స్వయంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే పంపించారని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలో కాలం చెల్లిన నేతలకు బీజేపీ కండువా కప్పుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఐదుగురు ఎమ్మెల్యేల నుంచి ఒక్క ఎమ్మెల్యేకు పడిపోయిన గ్రాఫ్..!
25 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలకు.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఇంకా తెలియడం లేదా అని ప్రశ్నించారు తలసాని. డిసెంబరులో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా.. ఆ పార్టీ నేతలు ఇంకా గుణపాఠం నేర్వలేదన్నారు. తెలంగాణలో అల్టర్నేట్ తామేనంటూ ఏళ్లకొద్దీ చెబుతున్న బీజేపీ నేతలకు నిరీక్షణ తప్ప నో యూజ్ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బీజేపీ ఎదగడం మాట అటుంచితే.. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి చివరకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే దిక్కాయాడని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు పనీపాటా లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం తప్ప వారికి మరో పని లేదన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలను ప్రస్తావిస్తూ.. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణానికి ఎవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
తర్వాత వాళ్లే ఫోటోలకు ఫోజులిస్తారుగా..!
అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలపై బీజేపీ నేతలు చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదమన్నారు టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. గుజరాత్లో వల్లభాయ్ పటేల్ విగ్రహంతో పాటు ముంబైలో శివాజీ విగ్రహం కోసం కోట్లు కుమ్మరించిన పార్టీ నేతలకు.. తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్ కట్టడాలపై మాట్లాడే అర్హత లేదన్నారు.
ఇప్పుడు తెగ ఆరోపణలు చేస్తున్న నేతలే.. ఆ భవనాలు నిర్మించాక వాటి ముందు నిల్చుని ఫోటోలకు ఫోజులిస్తారని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ నేతలకు అధికార పార్టీ చేసే ప్రతి పనిని విమర్శించడం తప్ప వారికి వేరే పని లేదని వ్యాఖ్యానించారు. సచివాలయం నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు.