నేరుగా ఫాంహౌజ్కు వెళ్లడం తప్పు: రుణమాఫీపై కేసీఆర్ను ఏకేసిన ఎర్రబెల్లి
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేసిన రుణమాఫీ రైతులకు ఊరటనిచ్చిందని, తెలంగాణలో మాత్రం రైతులకు అసలు రుణమాఫీనే చేయలేకపోయారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ తన మానిఫెస్టోలో చెప్పినట్టుగా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీలో అక్కడి ప్రభుత్వం ఒకేసారి రూ. 50వేల వరకు రుణమాపీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం రైతు ఆత్మహత్యలనే పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేద రాష్ట్రమైన ఏపీలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూ. 5 లక్షల చొప్పుల ఇస్తున్నారని, ఏపీతో పోటీపడే సీఎం కేసీఆర్ రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఆందోళనలతో టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు. టీడీపీ చేసిన పోరాటం వల్లే చీఫ్ లిక్కర్ ప్రక్రియపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని పేర్కొన్నారు.
తాను ఇప్పటికే శాసనసభాపక్షనేతగా ఉన్నానని, అధ్యక్ష పదవికి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేసినా తన సహకారం ఉంటుందని తెలిపారు. చైనా పర్యటన ముగించుకుని సీఎం కేసీఆర్ నేరుగా ఫాంహౌజ్కు వెళ్లడంపై తప్పుబట్టారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
దసరా పండుగనాడు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారు: మంత్రి తలసాని
ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చేదిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ మేరకు దసరా పండుగనాడు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లను మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, అధికారులు పరిశీలించారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాదులోని ప్రతి నియోజకవర్గంలో 400 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.