తెలంగాణ జవాన్ వీరమరణం... మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కంటతడి.... అన్ని విధాలా ఆదుకుంటామని హామీ...
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ ర్యాడ మహేష్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళి అర్పించారు. మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ వేల్పూర్ వాసిగా తాను అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మహేష్ భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని వీర జవాన్ మహేష్ స్వగ్రామం కోమన్ పల్లిలో సోమవారం (నవంబర్ 8) ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు.
హైదరాబాద్లో కాల్పుల కలకలం: గాల్లోకి ఆర్మీ జవాన్ ఫైరింగ్, రంగంలోకి పోలీసులు..
రేపు సాయంత్రం హైదరాబాద్కు...
మహేష్ వీరమరణాన్ని తలుచుకుని మంత్రి కంటతడి పెట్టుకున్నారు. మంగళవారం(నవంబర్ 9) సాయంత్రం మహేష్ పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంటుందని, బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. మహేష్ భౌతికంగా మన నుండి దూరమైన బాధ ఉన్నా... దేశం కోసం ప్రాణాలర్పించడం స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. వీర సైనికుడా యావత్తు తెలంగాణ నీకు నివాళి అర్పిస్తుందన్నారు. మహేష్ త్యాగం వెల కట్టలేనిదన్నారు.
చిన్నతనం నుంచే దేశభక్తి...
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేష్ చిన్నతనం నుంచే అమితమైన దేశభక్తిని కలిగి వున్నాడని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దేశం మీద ప్రేమతో సైన్యంలో చేరి భారతావని కోసం మహేష్ చేసిన త్యాగం మరువలేనిది అన్నారు. మహేష్ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని... వారికి తన ప్రగాఢ సానుభూతి అని తెలియజేశారు.మహేష్తో పాటు వీరమరణం పొందిన సైనికులకు జోహార్లు తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు.
ఐదేళ్ల క్రితం ఆర్మీలోకి...
జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో శనివారం(నవంబర్ 7) అర్ధరాత్రి టెర్రరిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ర్యాడ మహేష్(26) వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా.. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో మహేష్తో పాటు ఒక ఆర్మీ అధికారి,ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మహేష్ ఐదేళ్ల క్రితం ఆర్మీకి ఎంపికయ్యారు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్టోబర్ వరకు డెహ్రాడూన్లో విధులు నిర్వర్తించిన మహేష్ బదిలీపై జమ్మూకశ్మీర్కు వెళ్లాడు. మహేష్ వీరమరణంతో ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.