కేటీఆర్ జిల్లాల టూర్ తర్వాతే మంత్రి పదవులు..! విధేయులెవరో తేలేది అప్పుడే
హైదరాబాద్ : మంత్రివర్గం కూర్పుపై సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారా? మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారా? ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు గడుస్తున్నా.. మంత్రుల ఎంపికపై ఇంకా నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి. అయితే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన గులాబీ బాస్.. తనయుడు కేటీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ కు పునాదులు వేసేందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నారనేది ఒక వాదన.
అష్టదిగ్గజాలతో మంత్రివర్గం కూర్పు ఉంటుందని కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. ఆ అమాత్యులు ఎవరనేది ఇంకా తేల్చలేదు. తాజా సమాచారం మేరకు ఈ నెలాఖరుకల్లా మంత్రుల ఎంపిక చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
అష్టదిగ్గజాలెవరో..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 11న వచ్చాయి. 13న సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటినుంచి మంత్రివర్గణ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు.. మరెన్నో కథనాలు. తొలుత ఎంతమందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే దానిపై వీపరీతమైన చర్చ. చివరకు 8 మందితో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందని ప్రకటించారు కేసీఆర్. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు గడుస్తున్నా.. ఆ అష్టదిగ్గజాలు ఎవరో మాత్రం తేల్చలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠ మొదలైంది.
దూరదృష్టి.. వీరవిధేయులకే ఛాన్స్..!
మంత్రివర్గ ఏర్పాటుపై కేసీఆర్ దూరదృష్టితో ఉన్నట్లు తెలుస్తోంది. నూటికి నూరు శాతం వీరవిధేయులకే పట్టం కట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి తీసుకొచ్చి జాతీయ రాజకీయాలపైకి మనసు మళ్లిన గులాబీ బాస్.. తనయుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకే తారకరాముడ్ని సీఎంగా ప్రకటిస్తే.. మంత్రివర్గంలో నమ్మినోళ్లు ఉంటేనే సేఫ్ అని డిసైడయినట్లు సమాచారం. ఆ కోణంలోనే మంత్రివర్గంపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ కోసమేనా ఈ పునాది..!
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు కేటీఆర్. వారం, పదిరోజుల్లో ఉమ్మడి 10 జిల్లాలను చుట్టివచ్చేలా కార్యక్రమాలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా కేసీఆర్ స్ట్రాటజీలో భాగమేనంటున్నారు కొందరు. ఆయన జిల్లాల పర్యటన పూర్తయ్యేంతవరకు మంత్రివర్గ విస్తరణ ఉండబోదని సమాచారం. కేటీఆర్ ను పవర్ సెంటర్ గా మార్చడం కోసమే ఇదంతా అనేది మరికొందరి వాదన.
ఇప్పుడప్పుడే మంత్రులను ప్రకటిస్తే.. కేటీఆర్ జిల్లాల పర్యటనలో ఆయనకు అంత క్రెడిబిలిటీ ఉండకపోవచ్చనే కారణంతో ఇలా డిసైడయ్యారట. అంతేకాదు ఆయా జిల్లాల పర్యటనలో కేటీఆర్ వీరవిధేయులెవరో తేల్చి మరీ మంత్రి పదవులు ఇవ్వనున్నారట. దీంతో అచ్చంగా కేటీఆర్ కు అనుకూలంగా ఉన్న వ్యక్తులే మంత్రులు కాబోతున్నారనేది ఓ టాక్.