తెలంగాణ మంత్రులకు డబుల్ షాక్...
తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు మంత్రి ప్రశాంత్రెడ్డికి డబుల్ ఇళ్ల షాక్ తగిలింది. జనగామ జిల్లాలో పర్యటిస్తున్న వారిని మహిళలు అడ్డుకున్నారు. తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డు పై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవాపూర్లో గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించేందుకు పంచాయితీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజయ్యలు వెళ్లారు. కార్యక్రమంలో పాల్గోని తిరిగి వస్తున్న మంత్రుల బృందాన్ని గ్రామంలోని కొంతమంది మహిళలు అడ్డుకున్నారు. తమకు డబుల్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు మంత్రుల కాన్వాయ్కి అడ్డుగా ఉన్న మహిళలను బలవంతంగా తొలగించారు. అనంతరం మంత్రులను పంపించి వేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కాగా జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడ లబ్దిదారుల ఎంపికలో కొంత ఆలస్యం అవుతుండగా... జిల్లాలోని డబుల్ ఇళ్ల నిర్మాణం నత్తనడక నడుస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. దీంతో పలువురు లబ్ధిదారుల్లో అందోళన మొదలైంది.