మిర్యాలగూడలో గుత్తా, వనపర్తిలో సింగిరెడ్డి, సూర్యాపేటలో జగదీష్, కొనసాగుతోన్న మున్సిపోల్ పోల్
తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ కొనసాగుతోంది. 120 మున్సిపాలిటీ, 9 కార్పొరేషన్లలో పోలింగ్ ఊపందుకొంది. మంచు వల్ల ఉదయం మందకొడిగా పోలింగ్ జరిగినా.. 9 గంటల తర్వాత ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులుతీరారు. ఐడీ ప్రూఫ్ పరిశీలించి ఓటేసేందుకు అనుమతిస్తున్నారు. మరొవైపు కొంపల్లి మున్సిపాలిటీలో ఫేస్ రికగ్నేషన్ యాప్ ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో దొంగ ఓట్లు ఉంటే తేలికగా కనిపెట్టే వెసులుబాటు ఉండనుంది.
144 సెక్షన్
మున్సిపల్ ఎన్నికల కోసం 7961 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఎన్నికల సరళిని ఈసీ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తోంది. వృద్దులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చే సౌకర్యం ఏర్పాటుచేసింది. దీంతో వారు నిరీక్షకుండా ఓటేసీ.. వెనుతిరిగి వెళ్లిపోయే ఆస్కారం ఉంది.
మిర్యాలగూడలో గుత్తా
మిర్యాలగూడలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎస్ఆర్ డీజీ స్కూల్లో వారు ఓటేశారు. అనంతరం ఇంకుకు ఎన్నికల అధికారులు అంటించిన సిరా చుక్కను చూపించారు. అదే పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా ఓటు వేశారు.
సూర్యాపేటలో జగదీష్
సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. పట్టణంలోని 44వ వార్డు పరిధిలో గల నెహ్రూనగర్ సిద్ధార్థ స్కూల్కు కుటుంబసభ్యులతో కలిసి చేరుకున్నారు. ఉదయం 7 గంటలకే 136వ బూత్లో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.
వనపర్తిలో సింగిరెడ్డి
వనపర్తి జూనియర్ కాలేజీలో మంత్రి నిరంజన్ రెడ్డి తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి బాయ్స్ జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన 2వ పోలింగ్ కేంద్రంలో తన ఓటును వేశారు.