బీజేపీలోకి టీఆర్ఎస్ మంత్రులు, పేర్లు వెల్లడిస్తా: ఎన్వీఎస్ఎస్ సంచలనం
హైదరాబాద్: త్వరలో అధికార తెరాస మంత్రులు తమ పార్టీలోకి వస్తారని, వారి పేర్లు త్వరలో వెల్లడిస్తామని భారతీయ జనతా పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తామని, ప్రతిఘటిస్తామని చెప్పారు. ఆర్టీసీ వినియోగిస్తున్న డీజిల్ పైన వ్యాట్ ఎందుకు ఎత్తివేయరని ప్రశ్నించారు.
కేసీఆర్ గ్రామమే మునుగుతోంది: కేటీఆర్
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద స్వయంగా ముఖ్యమంత్రి స్వగ్రామం నర్మాల మునిగిపోతుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు. భూనిర్వాసితులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాల మొసలి కన్నీళ్లు ప్రజలు నమ్మవద్దన్నారు. ప్రాజెక్టు విషయంలో వారు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.
ఫిరాయించిన వారిపై వేటు వేయండి: అలీ
కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికై తెరాసలో చేరిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ గురువారం డిమాండ్ చేశారు. శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ను కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం ఏర్పాటైన 26 నెలల్లోనే 47 మంది ప్రజాప్రతినిధులను ఇతర పార్టీల నుంచి చేర్చుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బంగారు తెలంగాణ తెస్తామన్న సీఎం కేసీఆర్ పార్టీ మారిన వారి ఇళ్లను బంగారం చేస్తున్నారన్నారు.
పన్నుపోటు లేకుండా పరిపాలిస్తామన్న కేసీఆర్, ఆర్టీసీని మూసేస్తామని బెదిరింపులకు పాల్పడటం విడ్డూరమన్నారు. రూ. 1500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రజలపై భారం వేస్తే వారితో కలిసే ఉద్యమిస్తామన్నారు. టిడిపి నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు.