ఇంకెన్నాళ్లీ గూండాగిరీ, చర్యలు తప్పవు: కోమటిరెడ్డికి తలసాని హెచ్చరిక, 24గంటల పర్యవేక్షణ
Recommended Video
హైదరాబాద్: శాసనమండలిలో ఛైర్మన్ స్వామి గౌడ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాడి చేయడంపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సమావేశాల జరుగుతున్న సమయంలో హెడ్ ఫోన్ను విసిరేయడంతో స్వామి గౌడ్ కంటికి గాయమైన విషయం తెలిసిందే.
గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. కాగితాలు చించి గవర్నర్, స్పీకర్ పైకి విసిరేశారు. ఈ సందర్భంలోనే కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో స్వామిగౌడ్ కంటికి గాయమైంది. దీంతో ఆయనను సరోజనీ కంటి ఆస్పత్రికి తరలించారు.
గుండాయిజం, దౌర్జన్యాలు సాగవు
ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గుండాయిజం, రౌడీయిజం ఇంకా ఎన్ని రోజులని ప్రశ్నించారు. వారి గుండాయిజాన్ని ఇక సహించబోమని తేల్చి చెప్పారు. గత 70ఏళ్ల నుంచి అసభ్య పదజాలం, దౌర్జన్యం కొనసాగించారని.. భవిష్యత్లో మాత్రం వారి దౌర్జన్యాలు సాగవని అన్నారు.
సిగ్గుపడాలి.. గుణపాఠం తప్పదు
మండలి ఛైర్మన్పై దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ సిగ్గుపడాలని తలసాని అన్నారు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే ఇలాంటి చిల్లర పనులు చేయరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుల తీరును ప్రజలు చూస్తున్నారని, వారే గుణపాఠం చెబుతారని అన్నారు.
చర్యలు తప్పవు..
ప్రభుత్వం కూడా దాడికి పాల్పడిన సభ్యులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.కాంగ్రెస్ సభ్యులు ముందే దాడి చేయాలని అనుకుని సభకు వచ్చారని అన్నారు. బీసీలు ఉన్నత పదవుల్లో కూర్చోవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని తలసాని శ్రీనివాస్ అన్నారు.
అరాచకం సృష్టిస్తున్నారు..
మండలి ఛైర్మన్పై భౌతిక దాడులకు దిగడం దారుణమని మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సభ్యులు సభలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుల తీరును ఆయన ఖండించారు.
రాజకీయ కుట్ర
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం దారుణమని, ఆ పార్టీ తీరును తాము ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో ఏముందని చూసే ఇంగిత జ్ఞానం కూడా కాంగ్రెస్కు లేకపోవడం శోచనీయమన్నారు. గడిచిన నాలుగేళ్ల అభివృద్ది గవర్నర్ ప్రసంగంలో ఉందని కర్నె స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు రాజకీయ కుట్రతో సోమాలియా, ఉగాండా దేశాల మాదిరిగా తెలంగాణను మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రభాకర్ ఆరోపించారు. రాజ్యాంగాధినేత ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుని దుర్మార్గపు చర్యకు పాల్పడిందన్నారు.
మెరుగైన వైద్యం కోసం.. పరామర్శలు..
కాంగ్రెస్ సభ్యులు దాడులకు పాల్పడటం దారుణమని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. స్వామి గౌడ్కి మెరుగైన వైద్యం అందించాలని సరోజినీ ఆస్పత్రి వైద్యులను మంత్రి ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామి గౌడ్ను మంత్రి లక్ష్మారెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియొద్దీన్, తదితర టీఆర్ఎస్ నేతలు పరామర్శించారు.
కుడి కంటికి దెబ్బ తగిలింది: వైద్యులు
మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కుడి కంటికి దెబ్బ తగిలిందని సరోజినీ కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన కుడి కంటిని స్కానింగ్ చేశామని, మరో 24గంటలపాటు పర్యవేక్షణ అవసరమని వైద్యులు తెలిపారు.