పీఆర్వోలను కూడా నియమించుకోలేని మంత్రులు .. సీఎం కనుసన్నల్లో కార్పోరేట్ పాలన
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంత్రులుగా నియమించబడిన వారు పేరుకు మాత్రమే మంత్రులుగా ఉండబోతున్నారు. పాలనా వ్యవహారాలను సీఎంవో పరోక్షంగా చేతుల్లోకి తీసుకుంటోంది. గతంలో కూడా మంత్రులుగా పనిచేసిన వారు కేవలం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు మాత్రమే పరిమితమయ్యారు. తమ తమ శాఖల పరిధిలో ఎలాంటి నిర్ణయాధికారాలు మంత్రులు తీసుకోలేదు. అంతా సీఎం కనుసన్నల్లోనే జరిగింది. అయినప్పటికీ మంత్రుల పేషీలపైన మరింత పట్టు బిగించడానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం గతంలో పీఎస్ల నియామకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే, ప్రస్తుతం పి ఆర్వో ల నియామకాన్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోనుంది. కనీసం పి ఆర్వో లను కూడా నియమించుకోలేని దయనీయమైన స్థితిలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉన్నారు అంటే వారి పదవులు నామ్ కే వాస్తే అన్నది చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది.
మంత్రుల శాఖల నియంత్రణకే ఈ నిర్ణయమా?
మంత్రుల శాఖలను నియంత్రణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో మంత్రుల పేషీల్లో పీఎస్ల నియామకాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న సీఎంవో ఆఫీస్ ఇప్పుడు పీఆర్వోల నియామకాన్నీ తన చేతుల్లోకి తీసుకుంది. యితే పీఆర్వోల నియామకానికి సంబంధించిన బాధ్యతను ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వాళ్లే ఎప్పటికప్పుడు మంత్రులకు పీఆర్వోలను సరఫరా చేస్తారని తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో పీఆర్వోలు భారీ ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే పీఆర్వోల నియామకాన్ని అవుట్ సోర్సింగ్ కు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ పాలన కు తెర తీస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.
కార్పొరేట్ పాలన కు తెర తీయడానికి పీఆర్వోల అవుట్ సోర్సింగ్
పీఆర్వోల నియామకం విషయంలో కార్పొరేట్ పాలన కు తెర తీయనున్నారు సీఎంవో అధికారులు. పీఆర్వోల విషయంలో కొత్త విధానం తీసుకు రావాలని, కార్పొరేట్ కమ్యూనికేషన్ పేరిట ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పీఆర్వోల పనితీరు, శాఖ స్వభావాన్ని బట్టి వీరికి రూ.45 వేల నుంచి రూ.70 వేల వరకూ వేతనాలు చెల్లించినా భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన అవినీతి చేశారని సీఎం దృష్టికి వచ్చింది . దీంతో ఈ నిర్ణయం తీసుకొని అటు పిఎస్ లను, ఇటు పీఆర్వోలను నియమించే బాధ్యతను సీఎంఓ తీసుకుంది. అయితే పీఆర్వోలలను పూర్తిగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించాలనే ఆలోచన ప్రభుత్వ పాలనలో కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించడమే అవుతుంది. ఈ నిర్ణయంతో తాజాగా నియమించబడిన మంత్రులు కనీసం పీఆర్వోలను నియమించుకునే స్వేచ్ఛ కూడా లేదని లొలోపల తెగ మదన పడిపోతున్నారు.
పీఆర్వోలను సీఎంవో నియమిస్తే... అవినీతి జరగదా?
పీఆర్వోలపై వచ్చిన ఆరోపణలతో వారి నియామక బాధ్యతను మంత్రులకు కాకుండా, సీఎంవో కు అప్పగిస్తే సీఎంవో ద్వారా నియమించబడిన పీఆర్వోలు అవినీతికి పాల్పడకుండా, ఎలాంటి అక్రమాలు చేయకుండా, ఏ సెటిల్మెంట్లకు తావు లేకుండా పని చేస్తారా? అవినీతికి పాల్పడటం, పాల్పడకపోవడం ఆ వ్యక్తి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. మంత్రులు నియమించుకున్న పీఆర్వోలు అవినీతికి పాల్పడతారు,సీఎంవో నియమించిన పీఆర్వోలు అవినీతికి పాల్పడరు అన్న గ్యారంటీ ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కేవలం కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించడమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. తమ వద్ద పని చేసే పీఆర్వోలు అవినీతికి పాల్పడితే కట్టడి చేయాల్సిన బాధ్యత సదరు శాఖా మంత్రికి ఉంటుంది. మంత్రుల ఆ బాధ్యతను కూడా నిర్వర్తించలేరు అన్నట్టుగా మొత్తం వ్యవస్థను సీఎంవో చేతుల్లోకి తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది .
సిఎంవో ద్వారా పిఆర్వో లను నియమిస్తే వారు మంత్రుల మాటను వింటారా ?
పీఆర్వో ల మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, పీఆర్వోలు చేసిన అక్రమాలు, లోపభూయిష్టంగా ఉన్న పీఆర్వో వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావించి పీఆర్వోలను నియమించే బాధ్యత సీఎంవో చేపట్టింది. అది కూడా కార్పొరేట్ ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో మంత్రులు తాము పెట్టుకున్న పీఆర్వోలే తమకు తెలియకుండా బోలెడన్ని అక్రమాలకు పాల్పడ్డారని ఇబ్బందులు ఎదుర్కొంటే, ఇప్పుడు మంత్రులు నియమించని సిఎంవో కనుసన్నల్లో పనిచేసే పీఆర్వోలు మంత్రుల మాటను ఏమేరకు వింటారు అన్నది కూడా ప్రశ్నార్ధకమే. మంత్రుల పేషీల్లో పని చేసినప్పటికీ సీఎంవో నియామకాలు చేపడుతుంది కాబట్టి సీఎంవో కనుసన్నల్లోనే పని చేసే అవకాశం ఉంది. మంత్రులు చెప్పిన పనులు చేస్తారు అన్న నమ్మకం ప్రస్తుతం ఉన్న మంత్రులకు సైతం లేదు. దీంతో సీఎంవో ఆజ్ఞానుసారమే మంత్రుల పేషీలన్నీ నడవాల్సిన పరిస్థితి. మంత్రులకు ఏ స్వేచ్ఛ లేకుండా చేయడానికి ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది.
మంత్రి పదవి నామ్ కే వాస్తే..ఇక అంతా సీఎంవో నిర్ణయమే
గతంలో పీఆర్వో వ్యవస్థ సక్రమంగా పని చేయలేదు. భారీ అవినీతికి పాల్పడింది. నెలవారి వసూళ్లను సైతం చేసింది. మంత్రుల పేషీలను భ్రష్టు పట్టించింది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావించిన సీఎం మంత్రుల పేషీలపై పూర్తిస్థాయి నిఘా పెట్టనున్నారు. గతంలోనే మంత్రులు స్వయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా సీఎం ఆదేశాల మేరకే పని చేశారు. ఇక తాజాగా మంత్రులుగా నియమించబడిన వారి పరిస్థితి అంతే. తమ చుట్టూ ఉండే వ్యవస్థలో, నిరంతరం మంత్రులుగా చేసే కార్యకలాపాలలో ఏ ఒక్కరూ మంత్రి ఆదేశాల మేరకు పని చేసేవారు లేరు. అంతా సీఎంవో నియమించిన కార్పొరేట్ శక్తులే . ఇకనుండి రాష్ట్రంలో మంత్రుల పేషీల్లో అంతా కార్పొరేట్ పాలనే కొనసాగనుంది అంటే ఎలాంటి ఆశ్చర్యము లేదు. పీఆర్వో వ్యవస్థను కూడా పూర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్న సీఎం పాలనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పీఆర్వో లనే అదుపులో పెట్టలేని మంత్రులు .. పాలన ఎలా చేస్తారు ?
మంత్రులు తమ వద్ద పని చేసే పీఆర్వోలను కట్టడి చేయలేకుంటే సంబంధిత శాఖల అధికారులను ఏవిధంగా కట్టడి చేయ గలరు అన్న ప్రశ్న సైతం ఉత్పన్నమవుతుంది. మంత్రులు పీఆర్వోలను కట్టడి చేయలేక పోతున్నారు అనే కారణంతోనే సీఎంవో తానే స్వయంగా నియామకాలు చేపడతానని నిర్ణయించడం, మంత్రుల సమర్థతపై అనుమానాలకు కారణం అవుతుంది. తన వద్ద పనిచేసే పీఆర్వో ని అవినీతికి పాల్పడకుండా కంట్రోల్ లో పెట్టలేని మంత్రివర్యులు, సంబంధిత శాఖ అధికారులను అవినీతికి పాల్పడకుండా ఎలా కట్టడి చేస్తారు. తమ శాఖలకు సంబంధించిన పాలనా బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనా మంత్రుల పేషీల్లో పీఆర్వోల నియామకంపై సీఎంవో తీసుకున్న నిర్ణయం పీఆర్వో ల అవినీతి అటుంచి , మంత్రుల పై నిఘా పెట్టేందుకేనని భావించాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కార్పొరేట్ పీఆర్వో వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర పాలనను నిర్ణయించనుంది అనేది తాజా పరిణామాలతో స్పష్టంగా కనిపిస్తోంది.