వయసులో చిన్నదే.. కానీ చుక్కలు చూపించింది: 'అస్మా' కేసు ఛేదించిన పోలీసులు..
చాంద్రాయణ గుట్ట ప్రాంతంలో తప్పిపోయినట్లుగా తిరుగుతున్న ఓ బాలికను.. స్థానిక యువకులు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.
హైదరాబాద్: వయసులో చిన్నదే అయినా.. తన అబద్దాలతో ఓ బాలిక పోలీసులనే బురిడీ కొట్టించింది. బాలిక చెప్పిన కట్టు కథలకు పోలీసులే గందరగోళానికి గురయ్యారు. చివరకు బాలిక అబద్దాలు చెబుతోందని గుర్తించిన పోలీసులు.. కేసును త్వరగానే చేధించారు.
వివరాల్లోకి వెళ్తే.. చాంద్రాయణ గుట్ట ప్రాంతంలో తప్పిపోయినట్లుగా తిరుగుతున్న ఓ బాలికను.. స్థానిక యువకులు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. పోలీసులు బాలికను పలు విషయాలపై ఆరా తీయగా.. తనను పుణే నుంచి తీసుకొచ్చిన కొంతమంది చాంద్రాయణ గుట్టలో వదిలిపోయారని చెప్పింది.
దీంతో పోలీసులు దినపత్రికల్లో బాలిక మిస్సింగ్ ను ప్రచురించారు. బాలిక కుటుంబ సభ్యులు సంప్రదించాల్సిందిగా ప్రకటన ఇచ్చారు. ప్రకటన చూసిన బాలిక నాయనమ్మ వహీదా శుక్రవారం చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది. బాలికను అస్మాగా గుర్తించారు.
నిజానికి బాలిక స్వస్థలం పుణే అయినప్పటికీ.. ఇంట్లోంచి తరుచూ పారిపోతోందనే ఉద్దేశంతో.. ఆమె తండ్రి హనీఫ్ షేక్ పాతబస్తీ శివారు వెంకటాపూర్లో ఉన్న బాలిక నాయనమ్మ వహీదాబేగం ఇంటికి 15 రోజుల క్రితం అస్మాను పంపించాడు. అయితే పారిపోయే అలవాటున్న ఆ బాలిక.. యథావిధిగా నాయనమ్మ ఇంటి నుంచి కూడా పారిపోయి బయటకు వచ్చింది.
చాంద్రాయణగుట్టలో బాలిక తచ్చాడుతుండగా.. స్థానికులు ఆమె తప్పిపోయినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎట్టకేలకు అస్మా ఆచూకీ దొరకడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.