అనాధాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు .. విచారణలో షాకింగ్ విషయాలు
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటనలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా,ఆమె సహకారంతో అక్రమాలకు తెగబడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆశ్రమ నిర్వాహకుడు మరిన్ని అకృత్యాలకు కూడా పాల్పడినట్టు తెలుస్తుంది .
అనాధాశ్రమ నిర్వాహకుడి ఘాతుకం .. మైనర్ బాలికకు మత్తుమందిచ్చి పలుమార్లు అత్యాచారం
కేసు విచారణకు హైపవర్ కమిటీ
అమీన్ పూర్ అనాధాశ్రమంలోని ఆశ్రమ నిర్వాహకుడు 14 ఏళ్ల మైనర్ బాలికకు మత్తుమందిచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అనారోగ్యానికి గురైన బాలికను ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగా బాలిక మృతి చెందింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విచారణకు హైపవర్ కమిటీని వేసింది.
చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో ఆశ్రమ నిర్వాహకుడికి సంబంధాలు ?
ఈ కమిటీ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో రెస్క్యూ చేసిన మైనర్ బాలికలను ఈ ఆశ్రమానికి పంపాలని సిబ్బందిపై ఒత్తిడి చేశారని సమాచారం. వెలుగులోకి వస్తున్న అంశాలతో ఈ ఆశ్రమంలో ఇంకా దారుణాలు జరుగుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఆశ్రమ నిర్వాహకుడు అయిన వేణుగోపాల్ సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని, ఆమె సహకారంతో వీరు అక్రమాలకు తెగబడినట్లుగా తెలుస్తోంది.
మృతి చెందిన బాలికనే కాకుండా మరో బాలికపై అత్యాచారం
ఆశ్రమ నిర్వాహకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మైనర్ బాలికనే కాకుండా మరో మైనర్ బాలికపై సైతం అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తుంది. దీనిపై బాలిక తరపు బంధువులు నిలదీయడంతో వారిని బెదిరింపులకు గురి చేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైపవర్ కమిటీ ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా అనాధాశ్రమాల్లో తనిఖీలు
హైపవర్ కమిటీ సభ్యులు అనాధాశ్రమంలో ఉన్న 70 మంది బాలికలను విచారించనున్నారు.అక్కడి పరిస్థితులు వారిని అడిగి తెలుసుకోనున్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు వందల అనాధాశ్రమాలలో కూడా తనిఖీలు చేపట్టనున్నారు. అనాధ ఆశ్రమాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేదానిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల మంది అనాధలు వివిధ అనాధాశ్రమాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక వీరిపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ దారుణ ఘటనతో గుర్తించింది ప్రభుత్వం .