కామాంధ టీచర్... మైనర్ బాలికపై అత్యాచారం... సిరిసిల్లలో వెలుగుచూసిన దారుణం...
సిరిసిల్లలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ కామాంధుడిగా మారాడు. ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఆ టీచర్ కొన్నేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బాలికను భయభ్రాంతులకు గురిచేయడంతో ఇన్నేళ్లు ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. శనివారం(నవంబర్ 27) ఎట్టకేలకు ఆ బాలిక తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో టీచర్ అసలు బాగోతం బయటపడింది.
ఎవరా టీచర్...
సిరిసిల్లకు చెందిన అవునూరి రమేశ్ అనే వ్యక్తి మండెపెల్లి మోడల్ స్కూల్లో పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్నాడు. గతంలో అదే పాఠశాలలో చదివిన ఓ బాలికతో అతను మాయ మాటలతో ఆకర్షించాడు. ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుని ఆమెను లోబరుచుకున్నాడు. గత మూడేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఆ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమె బెదిరించాడు. దీంతో బాధిత బాలిక ఇన్నాళ్లు ఆ విషయం ఎవరికీ చెప్పేదు.
ఎట్టకేలకు బయటపెట్టిన బాధితురాలు..
ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న ఆ బాలిక ఎట్టకేలకు తనపై జరుగుతున్న ఆకృత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు తంగళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అభిలాశ్ తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిందితుడిని త్వరగా పట్టుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని సీఐ హామీ ఇచ్చారు.
Recommended Video
గతంలోనూ ఇలాంటి ఘటనలు...
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఓ మైనర్ బాలికపై అత్యాచార ఘటన సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. మేడిపల్లి మండలం పసునూర్కి చెందిన బెజ్జంకి గంగారెడ్డి అలియాస్ గంగారాం(50) అనే పారిశుధ్య కార్మికుడు తన మనవరాలి వయసున్న ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్లా జిల్లాలోని గంభీరావ్పేటలో వెలుగుచూసింది. బాలికను స్కూల్లో దింపే క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకున్న ఓ ఆటో డ్రైవర్ ఆమెను లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగుచూసింది.