దంపతుల ప్రాణం తీసిన మైనర్లు: కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరిన బైక్, చిన్నారికి తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్సాగర్ సర్వీస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. వారి కుమార్తె తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వేగంగా వచ్చిన కారు.. గాల్లోకి ఎగిరిన బైక్
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నాగరాజు తన భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై హిమాయత్సాగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్తున్నాడు. హిమాయత్సాగర్ సర్వీస్ రోడ్డు దగ్గరకు రాగానే అతివేగంతో వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది.
అక్కడికక్కడే దంపతుల మృతి
ద్విచక్ర వాహనంపైనుంచి ఎగిరిపడ్డ దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజు కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులోని నలుగురు మైనర్లలో ఇద్దరికి గాయాలయ్యాయి.
చిన్నారి పరిస్థితి విషమం..
సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజు కూతురు పరిస్తితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
అతివేగమే.. మైనర్ బాలుడే కారు నడిపాడు..
మైనర్ బాలుడు మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వదని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ.. వారి తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో ఇలాంటి ప్రమాదాలు నగరంలో జరుగుతూనే ఉన్నాయి.