హస్తిన లో తెలుగమ్మాయి పై అత్యాచారం .. బాలిక గర్భం దాల్చటంతో అబార్షన్
నాగరికతకి నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగటంలేదు. బాలికలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆడుకునేందుకు రంగులు కొనిస్తానని ఇంకొకడు పసిమొగ్గల బతుకులను చిదిమేస్తున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలతో దేశం అట్టుడికిపోతోంది. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది.
హస్తిన లో దారుణం .. బాలికపై అత్యాచారం
రోజుకో చోట పసిమొగ్గలను చిదిమేస్తున్నారు కామాంధులు. అత్యాచార భారతం సభ్యసమాజాన్ని సిగ్గు పడేలా చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అత్యాచారానికి గురైన సదరు బాలిక మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కామాంధుల కర్కశత్వానికి బలైన ఆ బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు ఆ బాలికకు అబార్షన్ చేయించి నడిరోడ్డుపై వదిలి వెళ్లారు అగంతకులు. ఈ ఘటనపై సోమవారం సాయంత్రం ఢిల్లీ పోలీసులు ఏపీ భవన్ అధికారులను సంప్రదించారు.
గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ ..నిస్సహాయ స్థితిలో బాలిక
ఢిల్లీలోని గురుటేక్ నగర్లో నిస్సహాయంగా ఉన్న 16 ఏళ్ల బాలికను గుర్తించామని , ఆ బాలికకు ఇటీవలే అబార్షన్ చేసినట్లుగా ఉంది అని తెలిపారు . గతంలో ఎవరో అత్యాచారం చేసి తదనంతరం అబార్షన్ చేసినట్టుగా భావిస్తున్నామన్న పోలీసులు ఏపీ భవన్ అధికారులను తెలుగు , హిందీ రెండు భాషలు మాట్లాడగలిగే వాళ్ళు కావాలని కోరారు. . బాలిక మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో సంరక్షణ కేంద్రానికి తరలించి ప్రశ్నించామన్న అధికారులు హిందీ, ఆంగ్ల భాషలను అర్థం చేసుకోలేకపోతోంది. తెలుగు మాట్లాడుతోంది. కేసు నమోదు చేశామని చెప్పిన పోలీసులు, కోర్టులో మంగళవారం విచారణకు రానుందని తెలిపారు . హిందీ, తెలుగు అర్థం చేసుకొనే వ్యక్తిని దుబాసీగా పంపగలరు'' అని భవన్ అధికారులను ఢిల్లీ పోలీసులు కోరారు. పూర్తి వివరాలు వెల్లడించడానికి పోలీస్ అధికారులు నిరాకరించారు.
చిటికెన వేలుకి ఆపరేషన్ చేస్తే మరణించిన రోగి.. ఓ కార్పోరేట్ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం
అత్యాచారానికి గురైన తెలుగమ్మాయి ఎవరు .. ఢిల్లీ ఎలా వెళ్ళింది ?
అయితే ఈ కేసులో అసలు బాలిక ఎవరు? ఎక్కడి నుండి ఢిల్లీకి వచ్చింది? బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎవరు? బాలికపై జరిగింది సామూహిక అత్యాచారమా? బాలికకు అబార్షన్ చేయించింది ఎవరు? ఎవరైనా ట్రాఫికర్లు బాలికను ఢిల్లీ తీసుకుని వచ్చారా? ప్రస్తుతం బాలిక పరిస్థితి ఏంటి? మానసికంగా అనారోగ్యానికి గురైన బాలిక ముందు నుండి అలాగే ఉందా? లేక అత్యాచారం తర్వాత ఆ విధంగా మారిందా వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికీ సమాధానం వెతుకుతూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం ఇలా ఎందరో అభాగ్యులైన బాలికలు, లైంగిక వేధింపులకు గురవుతూ మౌనంగా ఆక్రోశిస్తున్నారు .