డిఎస్సీతో పాటే మైనారిటీ టీచర్ల నియామకం: కెసిఆర్ వెల్లడి
హైదరాబాద్: డీఎస్సీతో నోటిఫికేషన్తో పాటే మైనార్టీ పాఠశాలలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మంత్రులకు, ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. మైనార్టీ సంక్షేమంపై ఆయన మంగళవారంనాడు సచివాలయంలో సమీక్ష జరిపారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారు. 2016 జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 60 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో 30 పాఠశాలలను బాలికలకు, 30 పాఠశాలలను బాలురకు కేటాయించాలని, మైనార్టీ సంక్షేమ శాఖ నిధుల ద్వారా ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ స్వీకరించాలని ఆయన అన్నారు. ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన జరగాలని కూడా చెప్పారు.
మొదటి ఏడాది 5,6,7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించి యేటా ఒక్కో తరగతి పెంచుకుంటూ 12వ తరగతి వరకు రెసిడిన్షియల్ పాఠశాలల్లో విద్యా బోధన జరపాలని, మైనార్టీ పాఠశాలలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని సూచించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా డీఎస్సీ నోటిఫికేషన్తో విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.