మారుతిరావు షెడ్డులో కుళ్లిపోయిన శవం.. మిర్యాలగూడలో తీవ్ర కలకలం.. ప్రణయ్ హత్య తర్వాత మళ్లీ..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువుహత్య కేసులో నిందితుడు, తన కూతురు అమృత భర్త ప్రణయ్ ని దారుణంగా చంపించిన టి. మారుతిరావు మళ్లీ హెడ్ లైన్లకు ఎక్కాడు. మిర్యాలగూడ శివారులో మారుతిరావుకు చెందిన ఓ పాడుబడ్డ షెడ్డులో మృతదేహం లభించడం స్థానికంగా తీవ్రకలకం రేపింది. దీనికి సంబంధించి మిర్యాలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
శవంపై ఆయిల్ పోసి..
ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, రైస్ మిల్లుల వ్యాపారి అయిన మారుతిరావుకు పట్టణ శివారులోని అద్దంకి-నార్కట్పల్లి బైపాస్ రోడ్డులో ఓ స్థలం ఉంది. చాలా ఏళ్ల కిందట ఆ స్థలంలో ఓ రేకుల షెడ్డు నిర్మించి వదిలేశారు. ఆ షెడ్డులో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెళ్లి చూడగా అక్కడో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. దుర్వాసన రాకుండా ఉండేందుకు శవంపై ఆయిల్ పోసినప్పటికీ, ఎక్కువ రోజులు కావడంతో దాదాపు కుళ్లిపోయే స్థితికి చేరింది.
ఎవరా వ్యక్తి?
మారుతిరావు షెడ్డులో లభించిన మృతదేహం ఎవరిదో కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చని, జీన్స్ ప్యాంటు, బ్లూషర్టు ధరించి ఉన్నాడని పోలీసులు చెప్పారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిని బట్టి 10 రోజుల కిందటే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
చంపింది ఎవరు?
మారుతిరావు నేరచరిత్ర నేపథ్యంలో ఆయన షెడ్డులో మృతదేహం కనిపించడం చర్చనీయాంశమైంది. అయితే వ్యక్తిని అక్కడే చంపారా? లేక వేరేచోట చంపి ఉద్దేశ పూర్వకంగా షెడ్డులో పడేశారా ? అన్నతి తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి షెడ్డు ఓనర్ మారుతిరావును కూడా ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు. పోస్ట్ మార్టం ప్రాధమిక రిపోర్టును బట్టి దర్యాప్తు వేగవంతం చేస్తామని సీఐ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
బెయిల్ పై బయటున్న మారుతిరావు..
ఉన్నత కులానికి చెందిన మారుతిరావు.. తన కూతురు అమృత దళిత యువకుడు ప్రణయ్ ని పెళ్లిచేసుకుందన్న కక్షతో పరువు హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కిరాయి హంతకుడి ద్వారా ప్రణయ్ ను అతం చేసిన మారుతిరావు.. హత్యా నేరం కింద అరెస్టయి, ప్రస్తుతం బెయిల్ పై బయటున్నాడు. అమృతకు బాబు పుట్టిన తర్వాత కూడా తండ్రి కుటుంబానికి దూరంగానే ఉంటోంది. ఇక తాజా హత్యోదంతంతో మారుతిరావుకు సంబంధం ఉందా? లేదా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిఉంది.