చిన్నచూపా?: టీఆర్ఎస్పై ఎమ్మెల్యే భాస్కర్ రావు సంచలన కామెంట్స్
హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం పక్షపాత వైఖరిని అనుసరిస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అసెంబ్లీలో గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నియోజక వర్గంలో బీటీ రోడ్ల పునరుద్దరణపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పనులు జరగడం లేదన్నారు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
పార్టీ మారినవారిని చులకనగా చూస్తున్నందునే తనలాంటి ఎమ్మెల్యేల వినతులను పట్టించుకోవడం లేదన్నారు భాస్కర్ రావు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్రావు.. ఆ తర్వాత కొంత కాలానికే టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
భాస్కర్ రావు లేవనెత్తిన బీటీ రోడ్ల అంశంపై మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా అవే ఫిర్యాదులు చేశారు. 10ఏళ్లుగా తమ నియోజకవర్గంలో బీటీ రోడ్ల పునరుద్దరణ జరగలేదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. జరిగినట్టు నిరూపిస్తే..ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. రామలింగారెడ్డి వ్యాఖ్యలతో అధికార పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోనూ బీటీ రోడ్లపై దృష్టి సారించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు వ్యాఖ్యలతో.. ఫిరాయింపు నేతల పట్ల పార్టీలో చిన్నచూపు ఉందా? అన్న చర్చ ఊపందుకున్నది.