మారుతిరావుకు ఎంత కక్షంటే.. చింతపల్లిలో ఫ్లాట్ అమ్మిన డబ్బుతో ప్రణయ్ హత్య.. చార్జిషీటులో సంచలనాలు..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్య(ప్రణయ్ హత్య) కేసుకు సంబందించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం ప్రణయ్ హత్య కేసును విచారించింది. ఈ కేసులో పోలీసులు ఫైల్ చేసిన చార్జిషీటుపై ఈ మేరకు కోర్టు దృష్టిసారించింది. కూతురు తక్కువ కులం వాణ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో రగిలిపోయిన మారుతిరావు.. తన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మేసిమరీ ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చినట్లు చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు.
ఫ్లాట్ అమ్మి హత్యకు ప్లాన్..
వద్దన్నా వినకుండా ప్రణయ్ ని పెళ్లిచేసుకోవడం ద్వారా అమృత కుటుంబం పరువు తీసిందని, తద్వారా తండ్రి మారుతిరావును సమాజంలో తలదించుకునే పరిస్థితికి నెట్టేసిందని, ఆ కోపంతోనే ప్రణయ్ని హత్య చేయించడానికి మారుతిరావు సిద్ధమయ్యాడని, కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించడానికి చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గరున్న ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టాడని చార్జిషీటులో వెల్లడైంది. హత్య కేసులో ఏ2గా ఉన్న మారుతిరావు సోదరుడు శ్రవణ్ ఈ విషయాలను పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
కోర్టుకు నిందితులు.. శ్రవణ్ రాలేదు..
ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 1200 పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేశారు. అందులో 102 మంది సాక్షుల స్టేట్మెంట్లను పొందుపర్చారు. ఛార్జ్షీట్ దాఖలు కావడంతో కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ అయింది. ఏ1 మారుతిరావు శనివారం హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోగా, ఏ2 శ్రవన్ మంగళవారం నాటి కోర్టు విచారణకు హాజరుకాలేదు. మిగతా ఆరుగురు నిందితులులను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. చార్జిషీటులో నమోదైన స్టేట్మెంట్లలో మారుతిరావు వెల్లడించిన విషయాల్నీ కీలకంగా పేర్కొన్నారు.
తక్కువ కులం వాడు కాబట్టే..
స్కూలు వయసు నుంచే అమృత, ప్రణయ్ ల మధ్య ప్రేమ వ్యవహరం నడిచిందని, తమ కంటే తక్కువ కులం వాడు కాబట్టే ప్రణయ్ ని మర్చిపోవాలని అమృతను పలు మార్లు హెచ్చరించానని మారుతిరావు చెప్పినట్లు స్టేట్మెంట్ లో రికార్డయింది. కూతురు కులం తక్కువవాణ్ని పెళ్లి చేసుకున్న తర్వాత సమాజంలో తలెత్తుకోలేక పోయానని, పెళ్లి తర్వాత కూడా బంధువులతో రాయబారం పంపినా అమృత దిరిగిరాలేదని, కాబట్టే ప్రణయ్ ని చంపాలనుకున్నానని, హత్య చేయించేందుకు కావాల్సిన డబ్బును శ్రవణ్ ఏర్పాటు చేశాడని మారుతిరావు పేర్కొన్నాడు.
80 పేజీల్లో అమృత వెర్షన్..
ఈ కేసులో కేంద్ర బిందువుగా ఉన్న అమృత.. తన తండ్రికి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి ముందే కూతుర్ని దారిలోకి తెచ్చుకుని, స్టేట్మెంట్ ను తప్పుడు ప్రయత్నంగా చిత్రీకరించేందుకు మారుతిరావు విశ్వప్రయత్నాలు చేశాడు. ఆ క్రమంలోనే ప్రణయ్ దళితుడు కాదు క్రిస్టియన్ అని నిరూపించే ఫొటోలతో హైదరాబాద్ లో లాయర్ ను కలవడానికి వచ్చి, అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Recommended Video
పలు మార్లు కాలేజీ కూడా మాన్పించారని
తాను, ప్రణయ్ 9వ తరగతి నుంచే ప్రేమలో ఉన్నామని, కాలేజీకి వచ్చేసరికి ఈ విషయం తండ్రి మారుతిరావుకు తెలిసిందని, పలు మార్లు కాలేజీ కూడా మాన్పించారని, చివరికి హైదరాబాద్ వెళ్లి పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత మారుతిరావు, శ్రవణ్ లకు ప్రణయ్ పై ఇంకా కోపం పెరిగి చివరికి హత్య చేశారని అమృత తన స్టేట్మెంట్ లో వివరించింది. హత్యకు ముందు చాలా సార్లు ఇంటి చుట్టూ అనుమానాస్పద వ్యక్తులు సంచరించేవాళ్లని ప్రణయ్ తండ్రి బాలస్వామి పేర్కొన్నాడు.