ప్రణయ్ హత్య కేసు నిందితుడి పాపాల చిట్టా పెద్దదే.. గుజరాత్ పోలీసులకు అప్పగింత..!
నల్గొండ : మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమ విషయంలో యువతి తండ్రి అతడిని దారుణంగా హత్య చేయించారు. అయితే ఆ మర్డర్ కేసులో కరడుగట్టిన ఉగ్రవాది అస్గర్ అలీ ప్రధాన నిందితుడిగా పోలీసులకు చిక్కాడు. అదలావుంటే వరంగల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అస్గర్.. జులై 3వ తేదీన బెయిల్పై విడుదలయ్యాడు.
ఆ క్రమంలో నల్గొండ చేరుకున్న అస్గర్.. ప్రణయ్ హత్య కేసులో ఒప్పందం ప్రకారం ఇంకా తనకు డబ్బులు రావాల్సి ఉందని అమృత తండ్రి మారుతీరావును బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే గుజరాత్ హోం మంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో కూడా ముద్దాయిగా ఉన్న అస్గర్ అలీ.. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ క్రమంలో ఇటీవల నల్గొండ జిల్లాలో మళ్లీ దందాలు, సెంటిల్మెంట్లు చేస్తూ పోలీసులకు చిక్కాడు. అయితే హరేన్ పాండ్య హత్య కేసులో నిందితుడిని అప్పజెప్పాలంటూ అహ్మదాబాద్ కోర్టు నుంచి నోటీసులు అందడంతో ఇక్కడి పోలీసులు అక్కడికి వెళ్లి అస్గర్ను అప్పజెప్పారు.
ప్రణయ్ హత్య కేసులో హస్తం.. హరేన్ పాండ్య మర్డర్ కేసులోనూ
నల్గొండ జిల్లాలో ప్రణయ్ హత్య అప్పట్లో కలకలం రేపింది. అమృత అనే అమ్మాయితో నడిపించిన ప్రేమ వ్యవహారం చివరకు అతడిని దారుణంగా హత్య చేయించింది. ఆమె తండ్రి సుపారీ ఇచ్చి మరీ ప్రణయ్ను అంతమొందించాడు. దానికోసం కరడుగట్టిన ఉగ్రవారి అస్గల్ అలీతో జతకట్టాడు. అతడికి పెద్దమొత్తంలో డబ్బు ఆశజూపి ప్రణయ్ను హత్య చేయించాడు. అయితే లోకల్గా ఉన్న మరో మాజీ టెర్రరిస్ట్ అబ్దుల్ బారీ ఈ విషయంలో మారుతీరావుకు సహకరించాడు.
హరితహారం కామెడీయా.. కేసీఆర్ చెప్పిందేంటి మహేందరా.. మొక్క లేకుండా ఇదేందీ సామీ (వీడియో)
జైలు నుంచి వచ్చాక దందాలు
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పట్టుబడ్డ అస్గర్ అలీ జైలుకు వెళ్లొచ్చినా తన బుద్ధి మార్చుకోలేదు. ఆ కేసులో వరంగల్ జైలునుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ప్రణయ్ హత్యకేసులో మరో నిందితుడు అబ్దుల్ బారీ, అమృత తండ్రి మారుతీరావును బెదిరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పలు సెంటిల్మెంట్లు చేస్తూ గంజాయి దందా చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆ క్రమంలో జిల్లా పోలీసులు అతడి కదలికలపై దృష్టి పెట్టారు. దాంతో ఇటీవల గంజాయి అమ్ముతుండగా అరెస్ట్ చేసి జిల్లా జైలుకు పంపించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగానే.. హరేన్ పాండ్య హత్యకేసులో నిందితుడిని అప్పజెప్పాలంటూ అహ్మదాబాద్ కోర్టు ఇక్కడి పోలీసులకు నోటీసులు పంపింది. ఆ మేరకు పటిష్ట భద్రత మధ్య అస్గర్ అలీని గుజరాత్కు తరలించారు.
జీవితఖైదు విధించిన సుప్రీంకోర్టు.. ఆ క్రమంలో గుజరాత్ పోలీసులకు..!
గుజరాత్ హోం మంత్రి హరేన్ పాండ్య మర్డర్ కేసులో సుప్రీంకోర్టు జులై 5వ తేదీన అస్గర్ అలీకి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ప్రణయ్ హత్య కేసులో జులై 3వ తేదీన బెయిల్పై విడుదలై నల్గొండ చేరుకున్న అస్గర్.. సుప్రీం తీర్పు నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. జాతీయ దర్యాప్తు సంస్థ నిఘా పెట్టడంతో ఇటీవల నల్గొండ జిల్లా కేంద్రంలో సెటిల్మెంట్లు, గంజాయి దందా చేస్తున్నట్లు తేలింది. పలు ప్రాంతాలకు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. పక్కా వ్యూహంతో అస్గర్ అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు 20 రోజులపాటు కస్టడీలో ఉంచుకున్నారు. అనంతరం కోర్టు తీర్పు మేరకు జిల్లా జైలుకు తరలించారు. అయితే హరేన్ పాండ్య హత్యకేసులో గుజరాత్ పోలీసులకు అప్పగించాలన్న అహ్మదాబాద్ కోర్టు తీర్పు నోటీసుల మేరకు నిందితుడిని అక్కడకు తరలించారు.