మతిపోగొడుతున్న మిస్సింగ్ కేసులు..! ఆ అదృశ్యాలకు కారణం ఎవరు..?
కరీంనగర్/హైదరాబాద్ : కరీంనగర్ పోలీసులను అదృశ్య కేసులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ కేసుల్ని ఛేదించడం సవాల్గా మారింది. విద్యార్థులు, యువతీ, యువకులు నుంచి వివాహితల వరకు పలువురు అదృశ్యం అవుతూనే ఉన్నారు. ఇలాంటివి నెలలో 35 చొప్పున నమోదవుతున్నాయి. ఇటీవల అదృశ్య కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా లోతుగా విచారణ కరవవుతోంది. అదృశ్య కేసులన్నింటినీ ప్రేమ వ్యవహారంగా భావించడంతో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఏళ్ల తరబడి కొన్ని కేసులు పెండింగులోనే ఉన్నాయి.. వరుస అత్యాచారాలు, హత్య చేసి బావిలో పాతిపెట్టిన హాజీపూర్ ఘటన నేపథ్యంలో ఇప్పుడు అదృశ్యం కేసులు చర్చనీయాంశమవుతున్నాయి.
జిల్లాలో నెలకు 35 మంది మిస్సింగ్..! హాజీపూర్ కిరాతకంతో తల్లిదండ్రుల్లో ఆందోళన..!!
కరీంనగర్కు చెందిన ఇరవై తొమ్మిది ఏళ్ల మంద లక్ష్మీ , భర్త మంద శంకర్లకు కుమార్తె, కుమారుడు. శంకర్ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మార్చి 4న శంకర్ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాగా లక్ష్మీ కనిపించలేదు. భర్త పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా లక్ష్మీ గురించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు. సర్.. ‘మా కూతురు చివరి పరీక్ష రాసేదుకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. కూతురి స్నేహితులకు ఫోన్చేస్తే పరీక్ష రాసి వెళ్లిందని చెబుతున్నారు. కాస్త వెతికి పెట్టండి' అని ఓ తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేగం పెరగాలి..! ఫిర్యాదులపై లోతుగా విచారణ అవసరం..!!
అదృశ్యం కేసుల్లో పోలీసుల దర్యాప్తులో వేగం పెరగాల్సిన అవసరం ఉంది. సంచలనం సృష్టించే కేసులు వెలుగు చూసినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్నారు. కొన్ని రోజులు గడిచాక, తీసుకుని వెళ్లిన డబ్బులు అయిపోయాక వారే తిరిగి వస్తారనే ఆలోచనతో తల్లిదండ్రులకు ధైర్యం చెబుతున్నారు. అదృశ్యమైన కేసుల్లో ఫోన్డేటా, ఎక్కువగా ఫోన్లు మాట్లాడిన వారిని విచారించినా వివరాలు తెలియకపోవడంతో కేసు దర్యాప్తు ఆపేస్తున్నారు. అదృశ్య కేసుల్లో లోతుగా దర్యాప్తు చేయకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.
ఫిర్యాదుదారుల సహకారం ఏదీ? ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోలీసులు..!!
అదృశ్యం కేసుల్లో ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని, పిల్లలు అపహరణకు గురైతే ప్రమాదాన్ని ఊహించి పోలీసులకు పూర్తి సహకారం అందించకపోవడంతో కేసులు కుంటుపడుతున్నాయి. అదృశ్యం, అపహరణ జరిగినా రోజుల తరబడి విషయాన్ని కప్పి ఉంచడంతో వారు శాశ్వతంగా దూరమవుతున్నారు. తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేయడం, సరైన వివరాలు, కారణాలు పోలీసులకు చెప్పకుండా దాచి ఉంచడంతో కేసులను ఛేదించడంతో పోలీసులు విఫలమవుతునన్నారు.
అదృశ్యాల వెనక ఉన్నది ఎవరు..! ఆరా తీస్తున్న పోలీసులు..!!
యుక్త వయసు పిల్లలున్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు పాఠశాల, కళాశాలకు వెళ్తున్నారా? అని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలి. పిల్లల ప్రవర్తనలో మార్పులను గ్రహిస్తూ స్నేహితుల ద్వారా కారణాలను తెలుసుకుంటూ ఉండాలి. సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, అంతర్జాలం వినియోగిస్తున్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా పిల్లలను వదిలిపెట్టకుండా వారితో ఎక్కువగా సమయం కేటాయించాలి.