మహిళా టెక్కీ మిస్సింగ్ కేసు: రోహితను పూణేలో గుర్తించిన పోలీసులు..కుటుంబ కలహాలతోనే..!
పూణే/ హైదరాబాద్: 20 రోజుల క్రితం అదృశ్యమైన మహిళా టెక్కీ రోహిత ఆచూకీ దొరికింది. పూణేలో రోహిత ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ రోజు సాయంత్రం ఆమెను హైదరాబాదుకు పోలీసులు తీసుకురానున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు రోహితను అప్పగించనున్నారు పోలీసులు. అయితే కుటుంబ కలహాలతోనే రోహిత ఇళ్లు విడిచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. గత కొద్దిరోజులుగా రోహిత ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె అదృశ్యం మిస్టరీగా మారడంతో అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
పూణేలో రోహితను గుర్తించిన పోలీసులు హైదరాబాదుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె ఇక్కడకు వచ్చేందుకు ఇష్టం వ్యక్తం చేయడం లేదని చెప్పారు. హైదరాబాద్లో ఆమె యాపిల్ సంస్థలో పనిచేస్తోంది. అయితే పూణేకు వెళ్లిపోయిన తర్వాత అక్కడే మరో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అందువల్లే హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధంగా లేదని పోలీసులు చెబుతున్నారు. ఆమె గత నెల డిసెంబర్ 26వ తేదీ నుంచి కనిపించడం లేదు. అయితే ఏటీఎం నుంచి ఆమె రూ.80వేలు నగదు విత్డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబంలో గొడవలు చోటుచేసుకోవడంతో రోహిత భర్తకు దూరంగా ఉంటోంది.
గత నెల 26న ఇంటినుంచి బయటకు వెళ్లిన రోహితా తిరిగి రాలేదు. ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా పుణే వెళ్లిపోయింది. అయితే అక్కడ ఎవరి దగ్గర ఉన్నిందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమెకు ఎక్కడుందో తెలియకుండా ఉండేందుకు రోహిత తన ఫోన్ను కూడా స్విచాఫ్ చేసింది. ఇక తన సోదరి కనిపించకపోవడంతో డిసెంబర్ 29న పరీక్షిత్ గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు సంబంధించిన వస్తువులు అంటే ల్యాప్టాప్ ఐడీ కార్డు ఇలా అన్నీ ఇంట్లోనే వదిలి వెళ్లినట్లు తన ఫిర్యాదులో పరీక్షిత్ పేర్కొన్నాడు. అయితే రోహిత అదృశ్యంపై యాపిల్ సంస్థ కూడా ట్వీట్ చేసింది. రోహిత ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలంటూ సంస్థ ప్రధానకార్యాలయం ట్వీట్ చేసింది.