రసమయి బెదిరింపు? దరువు అంజన్న అదృశ్యం
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు దరువు అంజన్న అలియాస్ కమ్మరి అంజయ్య అదృశ్యం కొన్ని గంటలపాటు ఉత్కంఠకు గురి చేసింది. అంజన్న మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇంటి నుండి అదృశ్యమయ్యారు. తన భర్త కనిపించడం లేదని ఆయన భార్య సునీత బుధవారం జీడిమెట్ల పోలీసులకు, బాలానగర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
దరువు అంజన్న అదృశ్యం వార్త రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అంజన్నకు మద్దతుగా కళాకారులు, ఓయూ విద్యార్థులు ఏకమయ్యారు. అంజన్నను కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య, సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రసమయి బాలకిషనే కిడ్నాప్ చేయించారని వారు ఆరోపించారు. ఓయూ జేఏసీ చైర్మన్ దరువు ఎల్లన్న ఆధ్వర్యంలో ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దరువు అంజన్నకు ఎలాంటి ప్రమాదం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నిజమైన కళాకారులకు ఉద్యోగాలివ్వాలంటూ దగాపడ్డ కళాకారులందరినీ సమీకరించి నిరసన ధూంధాంను నిర్వహించినందుకు అంజన్నపై రసమయి కక్ష పూనినట్లు వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, కళాకారుల ఫిర్యాదులు, హెచ్చరికలు ఇలా ఉండగా బుధవారం రాత్రి దరువు అంజన్న ప్రత్యక్షమయ్యారు.
ఆయన రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కేపీహెచ్బీలో కనిపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు రసమయి బాలకిషన్ నుండి బెదిరింపులు వచ్చాయని చెప్పారు.
తెలంగాణ కోసం గజ్జెకట్టి పాడిన కళాకారులను పక్కన పెట్టి, ఉద్యమంతో ఏమాత్రమూ సంబంధం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆగ్రహించిన కళాకారులు మంగళవారం టకళాకారుల దీపం కేసీఆర్: సాంస్కృతిక సారథికి శాపం రసమయి బాలకిషన్' పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన దరువు అంజన్న తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యంపై పాటపాడారు. రసమయి ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో గళమెత్తారు.
దీనిపై దరువు అంజన్న మాట్లాడుతూ.. ఆ నిరసన కార్యక్రమం నేపథ్యంలో తనకు రాత్రి 11గంటలకు రసమయి బాలకిషన్ తనకు ఫోన్ చేసి నామీదే పాట పాడతావా..? నీ అంతుచూస్తానంటూ బెదిరించారని, ప్రాణభయంతో ఎవరికీ కనిపించకుండా పోయానని, ఫ్రెండ్ వద్ద ఉన్నానని, రసమయి నుంచి తనకు, తన కుంటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.
దీనిని రసమయి బాలకిషన్ ఖండించారు. తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వారిఅసలు ఉద్దేశ్యం ఉద్యోగాలు కాదని, తనను తిడుతూ పాటలు పాడారని, అపహరణ నాటకం ఆడారని, ఫోన్ కాల్స్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుందన్నారు.