భగీరథ నోటీసుపై భట్టి వర్సెస్ కేసీఆర్ .. ఆ పాపం మీదేనన్న సీఎం
హైదరాబాద్ : మిషన్ భగీరథ పేరుతో జగిత్యాల మున్సిపాలిటీకి ఇచ్చిన డిమాండ్ నోటీసు సభలో సీఎం కేసీఆర్, విపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య వాగ్వావాదానికి దారితీసింది. వాణిజ్య బ్యాంకు పేరుతో రుణం తీసుకుని నీరిస్తూ .. మున్సిపాలిటీ నుంచి ఎలా బిల్లు వసూల్ చేస్తారని భట్టి అనడంతో సీఎం కల్పించుకున్నారు. భట్టి లేవనెత్తిన సందేహాలపై అంశాలవారీగా తక్షణమే స్పందించి సమాధానం చెప్పారు కేసీఆర్
భగీరథపై మాటల మంటలు
జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి డిమాండ్ నోటీసు అంశాన్ని శనివారం సభలో శ్రీధర్ బాబు లేవనెత్తారు. ఈ టాపిక్ ను సోమవారం ప్రత్యేకంగా ప్రస్తావించారు భట్టి. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ మంచినీరు ఇస్తామని చెప్పి బిల్లు వసూల్ చేయడం ఏంటని ప్రశ్నింాచరు. అలాగే కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల అంశాన్ని కూడా మధ్యలో గుర్తుచేశారు భట్టి. మిషన్ భగీరథ అంశానికి సంబంధించి వాణిజ్య బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్ లో ఏం పేర్కొన్నారని నిలదీశారు భట్టి.
అవీ భగీరథ డ్యు కాదు ..
భగీరథ అంశంపై భట్టి విక్రమార్క సభలో మాట్లాడే సమయంలో పదే పదే కల్పించుకుని .. ఆయన లేవనెత్తిన అంశాలపై తక్షణమే క్లారిటీ ఇచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ ఇచ్చిన నోటీసు మిషన్ భగీరథ బకాయి కాదని స్పష్టంచేశారు. ఇదివరకు ప్రభుత్వాలు కట్టని డ్యు అని తేల్చిచెప్పారు. కంపెనీలకు 10 శాతం భగీరథ నీటిని సరఫరా చేస్తున్నామని సభకు చెప్పారు కేసీఆర్. ఇందుకు ఆయా కంపెనీలు బిల్లు చెల్లిస్తున్నాయని ఇదీ మంచి పరిణామమని స్పష్టంచేశారు.
వాణిజ్య బ్యాంకులు లోన్ ఇవ్వడమే గొప్ప
రాష్ట్ర ప్రభుత్వాలకు వాణిజ్య బ్యాంకులు నిధులు ఇవ్వడమే గొప్ప అన్నారు సీఎం కేసీఆర్. ఆ ప్రభుత్వానికి ఉన్న పనితీరు, సమర్థతకు నిదర్శమని పేర్కొన్నారు. ఇదివరకు ఉన్న సురక్షిత మంచినీటి పథకం (ఆర్ డబ్ల్యూఎస్) మిషన్ భగీరథగా మార్చామని కేసీఆర్ ప్రకటించారు.
ప్రజల నుంచి బిల్లు తీసుకుంటామని చెప్పామా ?
ఇంటింటికీ మంచినీరు సరఫరా చేసి ప్రజల నుంచి బిల్లు తీసుకుంటామని చెప్పామా అని ప్రశ్నించారు కేసీఆర్. లేని దానిని ఎందుకు సభలో ప్రస్తావించి హుందతనాన్ని కోల్పోవద్దని భట్టికి చురక అంటించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని .. దేశంలో మంచి పేరుందన్నారు. ఓ ప్రతిపక్ష నేతగా మీరు సభలో మాట్లాడే అంశాన్ని దేశం గమనిస్తోందని చెప్పారు.